
– ఈఎంసీ పరిధిలో తీవ్ర వివాదాస్పదంగా సర్వే నంబర్ 142 భూమి ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 17 : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ఎందుగల సర్వే నంబర్ 142 భూమి వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒకపక్క మండల రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తున్నప్పటికీ. సదరు భూమిపై తమకే సర్వహక్కులు ఉన్నాయని ప్రైవేటు వ్యక్తి వాదిస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఈ భూమిని పరిశీలించిన తాసీల్దార్ అక్కడ జరుగుతున్న జెసిబి పనులను అడ్డుకుని బుధవారం తన సిబ్బందితో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఉదయానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు నేలమట్టం అయ్యింది. దీంతో అటువైపుగా జాతీయ రహదారిపై వెళ్తున్న పలువురు అవాక్కయ్యారు. ఉదయం వేళ కొందరు ప్రైవేటు వ్యక్తులు వచ్చి తమ భూమిలోనే ప్రభుత్వ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారని పక్కనే ఉన్న కొందరు వ్యక్తులకు తెలిపినట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రధాన జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మూడు ఎకరాల విస్తీర్ణం గల సుమారు రూ.20 కోట్ల పైబడి విలువ కలిగిన ఈ భూమి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇది ప్రైవేటు వ్యక్తుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, లేక ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. గుంట భూమి ఆక్రమణకు ప్రయత్నిస్తేనే పోలీసు కేసుల వరకు వెళ్లే రెవిన్యూ అధికారులు, నెలల తరబడి సాగుతున్న ఈ తంతుపై సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్చరిక బోర్డులు తొలగించారని తెలుసుకున్న రెవిన్యూ సిబ్బంది మరోమారు తిరిగి బోర్డును అదే స్థలంలో ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మధ్య దోబూచులాడుతున్న ఈ సంఘటన ప్రత్యక్షంగా చూస్తున్న స్థానికులు చివరకు ఈ భూమి ఎవరిపాలు అవుతుందో అని చర్చించుకుంటున్నారు. గంటల వ్యవధిలోని ప్రభుత్వ హెచ్చరిక బోర్డు నేలమట్టం




