దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే భద్రాచలం ఆలయానికి సరికొత్త వైభవాన్ని తెచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రూ.351 కోట్లతో భద్రాచలం అభివృద్ధి చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఈ పనులకు జూన్ 27వ తేదీన అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భద్రాచలం అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించారు. రామ భక్తుల మనోభావాలకు అనుగుణంగా.. ఆగమశాస్త్ర నియమాలను పాటిస్తూ అభివృద్ధి పనులు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భద్రాచలం ఆలయ పూర్వ వైభవానికి, ఆధ్యాత్మికతకు ఎలాంటి భంగం కలగలకుండా.. సంప్రదాయ శిల్పకళను ప్రతిబింబించేలా రాతి నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాబోయే 200 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా భద్రాచలం దేవాలయాన్ని తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలోనే భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులపై సచివాలయంలో గురువారం దేవాదాయ శాఖ, భద్రాచలం ఆలయ అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం పేర్కొన్న గడువులోగా.. పనులన్నీ పూర్తి అయ్యేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. భద్రాచలంకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని మంత్రి తేల్చి చెప్పారు. వచ్చే శ్రీరామనవమి నాటికి భద్రాచలంలో ముఖ్యమైన పనులు మొత్తం పూర్తి చేసేలా ఈ ప్రాజెక్టును పలు విభాగాలుగా విభజించారు. ఆ పనులన్నీ ఒకేసారి చేపట్టాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఆలయ సంప్రదాయ నిర్మాణ శైలి, ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా పనులు చేయాలని సూచించారు. మరీ ముఖ్యంగా రాతి నిర్మాణాలకు, సాంప్రదాయ దేవాలయ వాస్తు శిల్పానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. భద్రాచలం పునర్నిర్మాణం తర్వాత.. ఆలయం తన చారిత్రక, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ప్రతిబింబించేలా ఉండాలని స్పష్టం చేశారు.