తెలంగాణలో అర్హులైన పేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్ల పంపిణీ వ్యవస్థలో భారీ ప్రక్షాళన మొదలైంది. లబ్ధిదారు
ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు, నిధుల దుర్వినియోగం అవుతోందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు, నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా సెర్ప్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లైవ్ అథెంటికేషన్ సర్వే ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. సర్వేలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్లు పొందుతున్న వారిలో ఇప్పటివరకు ఏకంగా 93,624 మందిని అనర్హులుగా సెర్ప్ అధికారులు గుర్తించారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వివిధ కేటగిరీల కింద 42 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా.. వారిలో నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా నిధులు పొందుతున్న వారు 19,04,239 మంది ఉన్నారు. ఈ బ్యాంకు ఖాతాల జాబితా ఆధారంగానే సెర్ప్ ప్రత్యేకంగా ఒక అధునాతన మొబైల్ యాప్ను రూపొందించి గత నెల ఆరంభంలో ఈ మెగా సర్వేను ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల పరిధిలోని గ్రామ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు బ్యాంకు ఖాతా లబ్ధిదారుల్లో 15,97,233 మందికి సంబంధించిన సర్వే విజయవంతంగా పూర్తయింది. ఈ నెలాఖరు నాటికి వంద శాతం సర్వేను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సర్వే నివేదికల ప్రకారం ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు లేని విచిత్రమైన పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. అనర్హులుగా తేలిన 93,624 మంది వివరాలను అధికారులు గుర్తించగా.. పెన్షన్లు పొందుతున్న వారిలో 40,751 మంది ఇప్పటికే చనిపోయినట్లు తేలింది. అయినా వారి పేరిట నిధులు డ్రా అవుతుండటం గమనార్హం. సుమారు 41,689 మంది లబ్ధిదారులు తాము ఇచ్చిన చిరునామాల్లో నివసించడం లేదు. వారి అసలు ఆచూకీ ఎక్కడా దొరకలేదు. మరో 11,184 మంది ఆధార్ కార్డులు సాంకేతికంగా చెల్లుబాటు కావడం లేదు. కానీ వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. వీరంతా కాకుండా మరో 3,475 మంది ఇతర పొరుగు రాష్ట్రాలకు శాశ్వతంగా వలస వెళ్లిపోయినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి రెగ్యులర్గా పెన్షన్లు అందుకుంటున్నారు.వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తులు..మరోవైపు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ సెర్ప్ సిబ్బంది ఈ సర్వే నిర్వహిస్తుండటంతో స్థానిక వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు పెద్ద ఎత్తున అధికారులను ఆశ్రయిస్తున్నారు. తమకు కూడా పెన్షన్ పొందేందుకు అర్హత ఉందని, తమ పేర్లను కొత్తగా నమోదు చేయాలని వినతిపత్రాలు అందిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెలాఖరుతో అనర్హుల తొలగింపు ప్రక్రియను ముగించి వచ్చే నెల మొదటి వారం నుంచి కొత్త పెన్షనర్ల ఎంపిక ప్రక్రియను ప్రారంభించేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. అర్హత ఉండి దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.