Lucknow Coaching Centre Fire : ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్నవూలో సోమవారం ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే అలీగంజ్ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా...
Lucknow Coaching Centre Fire : ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్నవూలో సోమవారం ఒక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే అలీగంజ్ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా భయంకరమైన మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో భవనం పైఅంతస్తులో ఉన్న ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్లో వందలాది మంది విద్యార్థులు క్లాసుల్లో ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో.. విద్యార్థులు అంతా ప్రాణ భయంతో అల్లల్లాడిపోయారు. దట్టమైన పొగలు భవనాన్ని కమ్మేయడంతో ఊపిరాడక, బయటకు వచ్చే దారి లేక పలువురు అభ్యర్థులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు భవనం పైఅంతస్తుల కిటికీల నుంచి కిందకు దూకారు. ఈ హృదయవిదారక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.కింది భాగంలో మొదలై.. పైకి ఎగబాకిన మంటలు!స్థానిక అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీగంజ్ పరిధిలోని సదరు మూడంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో తొలుత ప్రమాదవశాత్తు మంటలు ప్రారంభం అయ్యాయి. అక్కడ మంటలు అంటుకున్న కొద్ది సేపటికే.. అవి అత్యంత వేగంగా పైఅంతస్తుల్లో ఉన్న కోచింగ్ సెంటర్కు, వాణిజ్య సంస్థలకు ఎగబాకాయి. క్షణాల వ్యవధిలోనే భవనం అంతా నిప్పుల కొలిమిలా మారిపోయింది. కాంప్లెక్స్ మొత్తం దట్టమైన నల్లటి పొగలు అలముకోవడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఏమీ కనిపించలేదు. కిందకు దిగే మెట్ల మార్గం కూడా మంటల్లో చిక్కుకుపోవడంతో.. క్లాసు రూముల్లో ఉన్న అభ్యర్థులు తీవ్ర భయాందోళనల మధ్య కేకలు వేశారు. ఎలాగైనా సరే ప్రాణాలు దక్కించుకోవాలనుకుని.. కొందరు సాహసించి కిటికీల నుంచి కిందికి దూకేశారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. భవనమంతా పొగతో నిండిపోవడంతో రెస్క్యూ సిబ్బందికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మొత్తంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మంది గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే భవనం లోపల ఇంకా ఎంత మంది చిక్కుకుపోయారనే దానిపై స్పష్టమైన సమాచారం రాలేదని అధికారులు వెల్లడించారు. కిందకు దూకిన విద్యార్థులకు, పొగ కారణంగా అస్వస్థతకు గురైన వారికి స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. భవనంలో సరైన అగ్నిమాపక రక్షణ ఏర్పాట్లు ఉన్నాయా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ఇంకా వేగంగా కొనసాగుతున్నాయి.