
హైదరాబాద్లో సినీ కథను తలపించే భారీ గోల్డ్ స్కామ్ వెలుగుచూసింది. మాటలతో మాయ చేసి... నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని... ఏకంగా రూ.21 కోట్ల విలువైన 13 కిలోలకు పైగా బంగారు
ఆభరణాలను కాజేసిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం... నితిన్ అనే వ్యక్తి తనకు దేశంలోని ప్రముఖ జువెలరీ షోరూమ్లతో సన్నిహిత వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పి పలువురు జువెలరీ వ్యాపారులను నమ్మించాడు. భారీ స్థాయిలో బంగారం కొనుగోలు, విక్రయాలు చేస్తానని, మంచి లాభాలు వస్తాయని హామీ ఇస్తూ వారి విశ్వాసాన్ని సంపాదించాడు.
నితిన్ మాటలను నమ్మిన నవ్య జువెలర్స్, సిద్ధి వినాయక జువెలర్స్, బన్సీలాల్ జువెలర్స్, శ్యాంబాబా జువెలర్స్ యజమానులు విడతల వారీగా అతనికి 13 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను అప్పగించారు. వాటి మొత్తం విలువ సుమారు రూ.21 కోట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం తీసుకున్న తర్వాత నితిన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది.
వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన నలుగురు జువెలరీ షోరూం యజమానులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మోసంలో నితిన్ ఒక్కడే కాకుండా అతని భార్య సోదరుడు, మరో నలుగురు కూడా భాగస్వాములయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతో ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. కోట్ల రూపాయల బంగారం ఎక్కడికి తరలించారు? ఈ ముఠా వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన జువెలరీ వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది.
ఆ చేపలు.. ఒక్కొక్కటీ రూ.50 వేలు.. కచిడి చేపల ప్రత్యేకత ఏంటంటే?
హాంగ్కాంగ్లో పూమా హైరాక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2027: ఆసియాలోనే తొలిసారి!
.