
కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు త్వరలోనే భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న డీజిల్ వ్యయం నేపథ్యంలో రాష్ట్రంలో బస్సు ఛార్జీల పెంపును ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. పెంపు ప్రతిపాదనలు తన టేబుల్ మీద ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలపై ఏ క్షణమైనా ఆయన సంతకం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే బస్ ఛార్జీల పెంపు విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ బస్సు ఛార్జీలను సమాంతరంగా పెంచాల్సి ఉందని, ఈ నిబంధనపై రవాణా శాఖ ఉన్నతాధికారులతో మరోసారి సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందని వివరించారు. ప్రస్తుతం 44 శాతం వరకు పెంపు ప్రతిపాదనలు ఉండగా.. దీన్ని సగానికి తగ్గించవచ్చని తెలుస్తోంది.డీజిల్ ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో బస్ ఛార్జీలను సవరించడం తప్పట్లేదని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చెబుతోంది. ఆర్టీసీ మనుగడ సాగించాలంటే ధరల సవరణ అవసరమని పేర్కొంది. కేఎస్ఆర్టీసీ కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే శక్తి పథకం అమలులోకి వచ్చాక నష్టాలు పెరిగాయి. ఈ పథకానికి అనుగుణంగా సకాలంలో ప్రభుత్వం నిధులను కేటాయించట్లేదని చెబుతున్నారు.2023 జూన్ 11న ప్రారంభమైన ఈ పథకం సజావుగా సాగడానికి ఇప్పటివరకు సుమారు 8,800 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. దీనికి తోడు బస్ పాస్‌లు ఉన్న విద్యార్థులందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో సంస్థపై మరింత భారం పడనుంది. డీజిల్ ధరల పెరుగుదల, సిబ్బంది వేతనాల వల్ల పెరిగిన ఖర్చులను తట్టుకోవడానికి కేఎస్‌ఆర్‌టీసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది జనవరిలో ప్రభుత్వం బస్సు టికెట్ల ధరలను 15 శాతం మేర పెంచింది.అంతకుముందు అయిదేళ్లపాటు రవాణా ఛార్జీలను సవరించకపోవడం, రోజువారీ డీజిల్ ఖర్చు 9.16 కోట్ల రూపాయల నుండి ఏకంగా 13.21 కోట్ల రూపాయలకు చేరడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో పాటు ఉద్యోగుల జీతభత్యాల పెంపు కూడా రవాణా సంస్థలపై అదనపు భారాన్ని మోపింది. అప్పట్లో 15 శాతం మేర ధరలను పెంచినప్పటికీ.. కిలోమీటర్ ప్రాతిపదికన వసూలు చేసే ఛార్జీలు పొరుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని కేఎస్ఆర్టీసీ వివరణ ఇస్తోంది.ఉచిత పథకం ప్రారంభమైన తర్వాత బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఊహించని రీతిలో పెరిగినప్పటికీ, టికెట్ కొని ప్రయాణించే పురుషుల శాతం మాత్రం 48 శాతం నుంచి 36 శాతానికి పడిపోయింది. ఈ మార్పుల వల్ల కర్ణాటకలోని నాలుగు ఆర్టీసీ కార్పొరేషన్లు పూర్తిగా ప్రభుత్వ రీయింబర్స్‌మెంట్‌ నిధులపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి రాయితీ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం సంస్థలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. మొత్తం బకాయిలు రూ. 821 కోట్లు దాటినట్లు అధికారులు పేర్కొంటున్నారు.