కోల్కతాలోని శ్యామ్ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వద్ద మూడు స్వదేశీ యుద్ధ నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ భారత నౌకాదళానికి అంకితం చేశారు.
ఈ నౌకలు సముద్ర సామర్థ్యం, జల సర్వేలు, సబ్మెరైన్ వంటి కీలక రంగాల్లో భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచనున్నాయి. భారతీయ సాంకేతికతో ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ అనే మూడు నౌకలు నౌకాదళంలో చేరాయి. "ఈ మూడు నౌకలు భారతదేశ మూడు సంకల్పాలకు ప్రతీకలు. ఇవి భారత్లోనే రూపొందించారు. భారత్లోనే నిర్మించారు. ఇంజినీర్లు, కార్మికుల ప్రతిభకు ఇది నిదర్శనం. సముద్ర శక్తి బలంగా ఉన్న దేశానికి ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావం కూడా బలంగా ఉంటుంది. భారతదేశం ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంది. అందుకే సముద్ర రంగంలో ముందుకు వెళ్తోంది" అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐఎన్ఎస్ దునగిరి అనే నౌకను శత్రువులకు కనిపించకుండా ఉండే సాంకేతికతతో రూపొందించారు. ఈ నౌకలో బ్రహ్మోస్ క్షిపణులు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థ, అత్యాధునిక రాడార్లు, సెన్సార్లు, దీర్ఠకాల సముద్ర ఆపరేషన్ల సామర్థ్యంలో ఉంది. యుద్ధ సమయంలో ఈ నౌక కీలక పాత్ర పోషిస్తుందని నౌకాదళ అధికారులు చెబుతున్నారు. ఇక ఐఎన్ఎస్ సంశోధక్ సముద్ర తీర ప్రాంతాలు మ్యాపింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా లోతైతన సముద్ర జల సర్వేలు, సముద్ర శాస్త్ర భూగర్భ సమాచార సేకరణ ఈ నౌక పని. రక్షణ విభాగానికి ఎప్పటికప్పుడు డేటా అందించడానికి ఈ నౌక ఉపయోగపడుతుంది. ఆటోమనస్ అండర్ వాటర్ వెహికల్స్, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ వంటి అత్యాధునిక పరికరాలు ఈ నౌకలో ఉన్నాయి. ఐఎన్ఎస్ అగ్రయ్ ప్రముఖంగా జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన యుద్ధ నౌక. ఈ నౌకలో తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, తక్కువ లోతు సముద్ర ప్రాంతాల్లో పనిచేసే వ్యవస్థ ఈ నౌకలో ఉన్నాయి. శత్రువుల సబ్మెరైన్లను గుర్తించి ఎదుర్కొనే సామర్థ్యం ఈ నౌకకు ఉంది.