
హైదరాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. నగరంలో ఇప్పటికే అనేక ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు ఉండగా.. మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.
నగరంలో నాలుగులైన్ల ఎలివేటెడ్ హైవే నిర్మించేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ(HMDA) ప్రణాళికలు రచించింది. నగరంలోని నడిబొడ్డులో దీనిని నిర్మించనుండగా.. భారీగా ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వద్ద ఉన్న జీవీకే వన్ మాల్ నుంచి మెహిదీపట్నంలోని పీపీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే వరకు నాలుగులైన్ల హైవే నిర్మించనున్నారు. జీవీకే వన్ మాల్ దగ్గర ప్రారంభం కానున్న ఈ ఎలివేటెడ్ కారిడార్.. మసబ్ ట్యాంక్ మీదుగా పీపీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేకి అనుసంధానం చేస్తారు. ఇప్పటికే హెచ్ఎండీఏ ప్రతిపాదనలు సిద్దం చేయగా.. ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేస్తున్నారు.
దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. మూడు ప్రాంతాల్లో అప్ ర్యాంపులు, రెండు ప్రాంతాల్లో డౌన్ ర్యాంపులు అందుబాటులో ఉంటాయి. రెండు లైన్ల వెడల్పులతో వీటిని నిర్మించాలని డిజైన్ రూపొందించారు. తాజ్ డెక్కన్, మాసబ్ ట్యాంక్, సరోజిని దేవీ ఐ హాస్పిటల్, సమీపంలో అప్ ర్యాంపులు ఉంటాయి. ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, ఆసిఫ్ నగర్ రోడ్డు వద్ద డౌన్ ర్యాంపులు ఉంటాయి. ఇది పూర్తయితే పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్ నుంచి ఎయిర్పోర్టుకు వేగంగా చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రూట్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో గంట పాటు సమయం పడుతుంది. వర్షాలు పడితే ఇక వాహనాలు స్లోగా కదులుతున్నాయి. తాజ్ కృష్ణా హోటల్, కేర్ ఆస్పత్రి, పెన్షన్ ఆఫీస్, ఎన్ఎండీసీ ఏరియాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది.
పంజాగుట్ట వైపు నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందించేందుకు ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. నాలుగులైన్ల రహదారి కావడంతో వేగంగా వెళ్లే అవకాశముంటుంది. ఎయిర్పోర్టుకు వెళ్లేవారికి మరింత ఊరట కలగనుంది. అంతేకాకుండా బంజారాహిల్స్ నుంచి విజయ్ నగర్ కాలనీ వైపు వెళ్ల రూట్లో నాలుగు లైన్ల అండర్ పాస్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం సాయిల్ టెస్ట్, సమగ్ర ట్రాఫిక్ సర్వే లాంటివి నిర్వహిస్తున్నారు. డీపీఆర్ త్వరలోనే ప్రభుత్వానికి హెచ్ఎండీఏ సమర్పించనుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే టెండర్లను పిలిచి పనులను ప్రారంభించాలని చూస్తోంది. రెండేళ్లల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు. త్వరగా పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు.