
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురుకుల టెండర్లలో అవకతవకలు, రాష్ట్ర అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య చోటుచేసుకున్న సవాళ్లు, ప్రతిసవాళ్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
బహిరంగ చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ విసిరిన సవాల్ను స్వీకరించి గన్ పార్క్ వైపు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో హైడ్రామా నెలకొంది.ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న వ్యవహారం 'బిగ్ బాస్' షోను తలపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. పైకి పోరాటంలా కనిపిస్తున్నా, లోపల ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఈ రెండు పార్టీల అవినీతి, రాష్ట్ర అప్పులు, పాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుకు సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రజలకు వివరిద్దామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు 'డబుల్ ఎలిమినేషన్' తప్పదని, రాష్ట్రంలో 'డబుల్ ఇంజిన్' సర్కార్ రావడం ఖాయమని బండి సంజయ్ జోస్యం చెప్పారు.