విశాఖపట్నంవాసులకు వీఎంఆర్డీఏ (విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ) తీపికబురు చెప్పింది. నగరంలో మధ్యతరగతి కుటుంబాల కోసం అఫర్డబుల్ హౌసింగ్ నిర్మాణానికి ముందుకు వచ్చింది.
వీఎంఆర్డిఏ అధ్వర్యంలో విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిలో భాగంగా.. పీపీపీ విధానంలో నూతనంగా చేపడుతున్న రెండు ప్రధాన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పూజలు నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించారు. మిథిలాపురి వుడా కాలనీలో, వేపగుంటలో ఈ రెండు ప్రాజెక్టుల్ని జాయింట్ వెంచర్ కింద మూడేళ్లలో పూర్తిచేయనున్నారు. హైదరాబాద్కు చెందిన కంపెనీతో వీఆర్ఎండీఏ ఎంవోయూ చేసుకుంది. నగరంలో మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరల్లో ఇళ్లు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టులు చేపట్టామని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. అన్ని రకాల వసతులతో బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు అందిస్తామని.. ఈ రెండు ప్రాజెక్టుల్లో క్లబ్ హౌస్, ఇండోర్ జిమ్ వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రోజూ 50 నుంచి 60మంది ఆరా తీస్తున్నారని.. మూడేళ్లలో ఈ ప్రాజెక్టుల్ని పూర్తిచేస్తామన్నారు. పీపీపీ విధానంలో జాయింట్ వెంచర్ కింద చేపడుతున్నామని వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. మొత్తం ఫ్లాట్లలో ప్రాజెక్ట్ చేపట్టే సంస్థ 70 శాతం తీసుకుని.. 30 శాతం వీఎంఆర్డీఏకి ఇస్తుందన్నారు. ఈ ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉంటాయని.. ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేందుకు వీలుగా ఆఫీస్ స్పేస్ ఉండేలా ప్లాన్ చేస్తు్నామన్నారు.మిథిలాపురి వుడా కాలనీలో 2.78 ఎకరాల్లో, వేపగుంటలో 63 సెంట్ల స్థలంలో ఈ రెండు అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.124 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వీఎంఆర్డీఏ ఈ భూమిని సమకూర్చనుండగా.. హైదరాబాద్ నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపడుతుంది. మిథిలాపురి వుడా కాలనీలో మొత్తం 264 ఫ్లాట్లు వస్తాయి.. వీటిలో 96 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, 2.5 బెడ్రూమ్ ఫ్లాట్లు 88, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 80 ఉంటాయి. ఈ ఫ్లాట్ల విస్తీర్ణం 800 చదరపు అడుగుల నుంచి 1600 చదరపు అడుగుల వరకు ఉంటుంది. వేపగుంట ప్రాజెక్టులో 45 ఫ్లాట్ల వరకు వస్తాయంటున్నారు. ఈ ఫ్లాట్లను గేటెడ్ కమ్యూనిటీ మోడల్లో తొమ్మిది ఫ్లోర్లలో నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ప్రజల నుంచే వచ్చే డిమాండ్ను బట్టి ఎన్ని ఫ్లోర్లు, ఎన్ని ఫ్లాట్లు నిర్ణయిస్తారు.. వీటి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. 15 ఏళ్ల క్రితం మారికవలస దగ్గర 20 ఎకరాల్లో హరిత ప్రాజెక్టు పేరుతో మధ్య తరగతి ప్రజల కోసం ఇళ్ల నిర్మాణం చేశారు. అప్పటి నుంచి మళ్లీ నగరంలో హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టలేదు.. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం పర్యటనకు వచ్చిన సమయంలో అధికారులతో సమీక్ష చేశారు. నగరంలో ఎకనామిక్ రీజియన్లో మధ్యతరగతి ప్రజలు, ఐటీ ఉద్యోగుల కోసం అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. గతంలోనూ నగరంలో హౌసింగ్కు సంబంధించి ఓ సర్వే కూడా చేశారు. ఈ సర్వేలో చాలామంది ఆసక్తిగా ఉండటంతో పీపీపీ విధానంలో టెండర్లను ఆహ్వానించగా.. హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ నిర్మాణం చేసేందుకు ముందుకు వచ్చింది. వీఎంఆర్డీఏ ఆ సంస్థతో ఎంవోయూ కూడా చేసుకుంది