గాదె సాయికృష్ణ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుళ్లుగా పనిచేసే అశోక్, నాని సోమవారం రోజున.. సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. సాయికృష్ణ మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు ఈ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సహకరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు. సీఐ నాగరాజు అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఈ ఇద్దరు కానిస్టేబుల్స్.. సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోవటంతో ఈ కేసులో చిక్కుముడి వీడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అశోక్, నానిలను విజయవాడ కమిషనర్ రాజశేఖరబాబు ఇప్పటికే సస్పెండ్ చేశారు. సాయికృష్ణ మృతి, మృతదేహం మాయం వ్యవహారంలో ఈ హెడ్ కానిస్టేబుళ్ల పాత్ర ఉందని గుర్తించిన సిట్.. వీరిని నిందితులుగా చేర్చింది. అలాగే తమ ఎదుట హాజరుపర్చాలని సౌత్ ఏసీపీకి ప్రొడక్షన్ ఆన్ మెమో ఇచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం ఊహించని విధంగా వీరు సూర్యారావుపేట ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. గాదె సాయికృష్ణ కేసు అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపటంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా మే 29న గాదె సాయికృష్ణ బంధువులను కలిసేందుకు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని, సురేష్ అనే మరో వ్యక్తి వడ్డేశ్వరం వెళ్లినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ముగ్గురు వడ్డేశ్వరం వెళ్లినప్పటి సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగానే ఈ కేసులో వీరిని నిందితులుగా చేర్చారు. హెడ్ కానిస్టేబుల్ అశోక్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్లు, మద్యం షాపులు, లాడ్జీలకు సంబంధించిన వ్యవహారాలు చక్కదిద్దేవాడని సమాచారం. అలాగే పలు సెటిల్మెంట్లకు పాల్పడేవాడని ఆరోపణలు ఉన్నాయి. మరో హెడ్ కానిస్టేబుల్ నాని రౌడీషీటర్లు, పాత నేరస్థులతో స్నేహంగా ఉండేవాడని.. బెదిరింపులకు పాల్పడేవాడని సమాచారం. పటమట స్టేషన్, గన్నవరం స్టేషన్లలో పనిచేసే సమయంలో ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఓసారి సస్పెండ్ కూడా అయినట్లు తెలిసింది. ఈ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతో కలిసి సురేష్ రౌడీషీటర్ల కౌన్సెలింగ్, నిందితుల విచారణ వంటి విషయాల్లో జోక్యం చేసుకునేవాడని తేలింది.