
పాకిస్థాన్ లోని సింధ్ రేంజర్స్ కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం కార్యాలయం భవంతిని ఢీ కొట్టడంతో పేలుడు జరిగింది. ఈ బ్లాస్ట్ అనంతరం కాల్పులు జరిగాయి.
ఈ ఉగ్రదాడిలో నలుగురు పాకిస్థాన్ సైనికుల మృతి చెందగా.. మరో ఆరుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ కీలక ఆరోపణలు చేసింది. కరాచీ ఉగ్రదాడి వెనక భారత్ హస్తం ఉందని ఆరోపణలు చేసింది. అయితే తాజాగా పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. ఇతరులపై నిందలు వేయడానికి బదులుగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదులను నిర్మూలించాలని హితవు పలికింది.ఇదే విషయంపై భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ పాకిస్థాన్ పై మండిపడ్డారు. ఇటీవల జరిగిన కరాచీ ఉగ్రదాడిని భారత్ తో ముడిపెడుతూ వస్తున్న పాకిస్థాన్ రిపోర్ట్స్ ను చూశాము. ఈ ఆరోపణలు నిరాధారమైనవి. మేము ఆ ఆరోపణలను ఖండిస్తున్నాం. ఇతరులపై వేలు చూపించడం మానేసి.. పాకిస్థాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ దేశంలోని టెర్రర్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలి. ఉగ్రవాదంపై ఆధారపడటాన్ని వదిలించుకోవాలి అని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.అంతకుముందు కరాచీ ఉగ్ర దాడిపై పాకిస్థాన్ ఇంటీరియర్ మంత్రి మోసిన్ నక్వీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ దాడి వెనక భారత్ ఉందని నిరాధారమైన ఆరోపణలు చేశారు. దాంతో తాజాగా పాకిస్థాన్ ఆరోపణలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. మరోవైపు పాకిస్థాన్ లోని కరాచీ ఉగ్రదాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) నుంచి విడిపోయిన జమాత్-ఉల్-అహ్రార్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఇక ఈ ఉగ్ర దాడిపై సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇక భారత్- పాకిస్థాన్ మధ్య గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత సంబంధాలు మరింతగా క్షీణించిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.