
Uppal: ఉప్పల్లో జెండా ఆవిష్కరణ జూలై 2న భూపోరాటానికి కవిత పిలుపు ఉప్పల్: తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి గోపు సదానంద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాల కేటాయింపు, ఇచ్చిన హామీలు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
ఉద్యమకారుల భూ హక్కుల సాధన కోసం జూలై 2న ఉప్పల్ బాగాయత్లో మిలియన్ మార్చ్ తరహాలో భారీ భూపోరాటం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ పోరాటానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు ఉప్పల్ బాగాయత్కు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఉప్పల్ బాగాయత్లోని ప్రభుత్వ భూములను ఉద్యమకారుల హక్కుల కోసం స్వాధీనం చేసుకునే దిశగా ఈ భూపోరాటం చేపడుతున్నామని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం జూలై 2లోపు ఉద్యమకారులకు స్థలాల పంపిణీ, గుర్తింపు అంశాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ స్థానికత, ఆత్మగౌరవంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించిన కవిత.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరేలా విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో విధానాలు ఉండాలని సూచించారు.
హైడ్రా, మూసీ ప్రాజెక్టులపై కూడా ఆమె స్పందిస్తూ.. హైడ్రా పనితీరుపై విమర్శలు చేసిన కవిత.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన వ్యవస్థలు రాజకీయ ప్రయోజనాలకు వాడకూడదన్నారు. వర్షాకాలంలో నగరంలో ముంపు సమస్యలు కొనసాగుతున్నా శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టాలని అన్నారు.
మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై కూడా ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. ప్రజల సొమ్మును ప్రజల ప్రయోజనాలకే వినియోగించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మూసీపై ప్రజల్లో అవగాహన కోసం పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని, ప్రజల మద్దతు లభిస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. జూలై 2న ఉప్పల్ బాగాయత్లో జరిగే భూపోరాటం తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం కీలక పోరాటంగా మారనుందని కవిత పేర్కొన్నారు.