
FactCheck | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులను రోడ్డున పడేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది.
దాదాపు 85 వేల మధ్యాహ్న భోజన కార్మికులను స్మార్ట్ కిచెన్ల పేరుతో వీధిపాలు చేస్తున్నారంటూ మాజీ సీఎం వైస్ జగన్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది. అలాంటి వదంతులు నమ్మొద్దని కోరింది. వంట కార్మికుల ఉద్యోగాల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాష్ర్ట ఫ్యాక్ట్ చెక్ విభాగం పోస్ట్చేసింది.
‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నాం. స్మార్ట్కిచెన్ల పేరుతో వంట కార్మికుల ఉద్యోగాలు పోతాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ వదంతులు మాత్రమే. అందులో వాస్తవం లేదు. ఇప్పటి వరకూ ఒక్క వంట కార్మిక ఉద్యోగమూ తొలగించలేదు. దశాబ్దం పాటు పనిచేస్తున్న 85 వేల వంట కార్మికుల సేవలను రాష్ర్ట ప్రభుత్వం గౌరవిస్తోంది. వారి ఉద్యోగాల భద్రతకు చర్యలు తీసుకుంటోంది’’ అని పేర్కొంది.
గౌరవ వేతనాల చెల్లింపు అంశంపైనా స్పందించింది. ‘‘మిడ్ డే మీల్ కార్మికులకు ఏప్రిల్ వరకూ గౌరవ వేతనాలను ప్రభుత్వం చెల్లించింది. సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన కొన్ని బకాయిలను త్వరలోనే చెల్లిస్తాం. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉండిపోయిన దాదాపు రూ.350 కోట్ల నిధులను ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో పాఠశాల ఆయాలు, వాచ్మెన్లకు నిలిచిపోయిన జీతాలు సహా విద్యార్థులకు కోడిగుడ్లు, శానిటరీ నాప్కిన్స్ వెండర్లకు చెల్లించాల్సిన బకాయిలనూ క్లియర్ చేశాం’’ అని ఎక్స్ వేదికగా పేర్కొంది. విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై తప్పుడు ప్రచారం చేయడం విచారకరమని ప్రభుత్వం పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.