
సోషల్ మీడియా వేదికగా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరిస్తూ, హల్ చల్ చేసిన హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అసలు రంగు ఎట్టకేలకు బయటపడింది.
తక్కువ ధరకే లగ్జరీ గోల్డ్ ఇప్పిస్తానంటూ నమ్మించి, అమాయకులను ముంచేస్తున్న పి. సురేశ్ కుమార్ అలియాస్ సూర్య భాయ్పై హైదరాబాద్ నగర పోలీసులు చీటింగ్ కేసులు నమోదు చేశారు.
అత్తాపూర్ ప్రాంతంలో నివసించే 34 ఏళ్ల సురేశ్ కుమార్, ఒంటి నిండా కిలోల కొద్దీ నకిలీ ఆభరణాలు వేసుకుని తిరుగుతుంటాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) తనకు అత్యంత ఆప్తులని ప్రచారం చేసుకున్నాడు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అచ్చమైన బంగారాన్ని అందిస్తానని పలువురిని నమ్మించాడు.
ఈ క్రమంలోనే ఓ బాధితుడి నుంచి ఏకంగా రూ.32 లక్షలు వసూలు చేసి, ఆ తర్వాత మొహం చాటేశాడు. బాధితులు తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో.. తప్పించుకోవడానికి మూడు ఐఫోన్లు, రూ.20 లక్షల విలువైన చెక్కు ఇచ్చాడు. అయితే, ఆ తర్వాత తన పరపతిని ఉపయోగించి బాధితులను బెదిరించి, ఇచ్చిన ఫోన్లను సైతం బలవంతంగా లాక్కున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మొదట ఈ ఘటనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, కేసు తీవ్రత దృష్ట్యా దీనిని తదుపరి దర్యాప్తు కోసం నారాయణగూడ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అంతేకాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు చేసినందుకు సూర్య భాయ్పై మరో అదనపు కేసు కూడా నమోదైంది.
గతంలోనే ఈ 'గోల్డ్ మ్యాన్' ఆర్భాటాలపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆరా తీశారు. తాను ధరించే నగలు రూ.కోటి విలువైనవని సూర్య భాయ్ చెప్పుకోగా, ఐటీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అవి చౌకబారు లోహాలతో చేసిన నకిలీవని తేలింది. వాటి అసలు విలువ కేవలం రూ.3 లక్షలు మాత్రమేనని నిర్ధారణ కావడం గమనార్హం.
ఈ నకిలీ గోల్డ్ మ్యాన్ ఉచ్చులో పడి ఇంకా ఎవరైనా మోసపోయారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియా పాపులారిటీని చూసి ప్రజలు మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.
.