
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి(Varanasi) సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ, మరోవైపు బాహుబలి(Bahubali) ప్రపంచాన్ని యానిమేషన్ రూపంలో...
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి(Varanasi) సినిమా పనులతో బిజీగా ఉన్నప్పటికీ, మరోవైపు బాహుబలి(Bahubali) ప్రపంచాన్ని యానిమేషన్ రూపంలో మరింత విస్తరించే ప్రయత్నాలు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. బాహుబలి: ది ఎటర్నల్ వార్(Bahubali the eternal war) పేరుతో రూపొందుతున్న ఈ యానిమేటెడ్ ఫీచర్కు ఇషాన్ శుక్లా(Ishaan Shukla) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి మాట్లాడుతూ, బాహుబలి ప్రపంచానికి సంబంధించిన కథలు, చరిత్ర ఇప్పటికే విస్తృతంగా సిద్ధంగా ఉండటంతో కొత్త కథలను అభివృద్ధి చేయడం పెద్ద సవాలుగా అనిపించలేదని తెలిపారు. డైరెక్టర్ ఆ ప్రపంచంలోని పాత్రలు, భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకున్నాడని నమ్మకం కలిగిన తర్వాత తాను వెనక్కి తప్పుకుని క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చినట్లు వెల్లడించారు.
భారతీయ యానిమేషన్ రంగం ఇంకా పూర్తిస్థాయిలో డెవలప్ కావాల్సి ఉన్నప్పటికీ, బాహుబలి వంటి విశాలమైన కథలకు యానిమేషన్ సరైన వేదిక అవుతుందని రాజమౌళి విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయ పురాణాల్లోని 14 లోకాల కాన్సెప్ట్ను బాహుబలి ప్రపంచంతో కలపాలన్న ఇషాన్ శుక్లా ఆలోచనే ఈ ప్రాజెక్ట్కు బలమైన పునాది అయిందని చెప్పారు. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్9RRR) సినిమాల ద్వారా భారతీయ కథల శైలిని ఆస్వాదించిన ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఈ యానిమేటెడ్ విస్తరణను కూడా ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. భారతీయ కథల్లో కనిపించే ఎమోషన్స్, పాత్రల వైవిధ్యం, సాంస్కృతిక రంగులే ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రధాన బలమని ఆయన అభిప్రాయపడ్డారు.
అత్యంత భారీ స్థాయి విజువల్ ప్రపంచాన్ని యానిమేషన్లో సులభంగా ఆవిష్కరించవచ్చని రాజమౌళి పేర్కొన్నారు. అయితే తన దృష్టిలో భారీ విజువల్స్, ఎమోషన్స్ రెండూ వేర్వేరు అంశాలు కాదని స్పష్టం చేశారు. ఎమోషన్ ఒక విత్తనం అయితే, దాని నుంచి పెరిగే భారీ వృక్షమే విజువల్ స్పెక్టకిల్ అని ఆయన ఆసక్తికరంగా వివరించారు. కథలోని ఎమోషన్ ఎంత బలంగా ఉంటే, దాని ఆధారంగా రూపొందే విజువల్ వరల్డ్ అంత గొప్పగా వికసిస్తుందని చెప్పారు. ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ ది ఎటర్నల్ వార్ను ప్రపంచ స్థాయి యానిమేషన్ అనుభూతిగా తీర్చిదిద్దే టార్గెట్ తో టీమ్ పనిచేస్తోందని రాజమౌళి వెల్లడించారు.