
మంత్రాలయం: మరో మూడు నెలల్లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధించాలని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) శ్రేణులకు పిలుపునిచ్చారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో తెదేపా శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. కర్ణాటకలోని హోసపేటెలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం సీఎం మాధవరం చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రాలయం తెదేపా ఇన్ఛార్జ్ రాఘవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘‘మన ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలి. తెదేపా నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారిని అక్కున చేర్చుకుంటా. ఓడిపోయిన వారిని పక్కన పెట్టేస్తా. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. మంత్రాలయం వైకాపా ఎమ్మెల్యే చిచ్చు పెడుతున్నారు.. ఆయనకు బుద్ధి చెబుతాం. 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. అధికారం ఉంది కదా అని నేతలు ప్రజలకు అందుబాటులో లేకపోతే వారికి దూరమవుతారు. మంత్రాలయం తెదేపాలో అసమ్మతి, విభేదాలు లేకుండా అందరూ ఒక్కతాటిపైకి వచ్చి గెలుపుకోసం పని చేయాలి’’ అని చంద్రబాబు సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.