
IND vs IRE: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 చారిత్రాత్మక విజయానంతరం సరికొత్త రోడ్మ్యాప్తో బరిలోకి దిగుతున్న టీమిండియా, ఐర్లాండ్ పర్యటనలో తొలి సమరానికి సిద్ధమైంది.
ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో తుది జట్టు ఎంపిక ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానం కోసం నలుగురు స్టార్ ఆటగాళ్లు పోటీ పడుతుండటంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
యువ సంచలనం వైభవ్ అరంగేట్రం ఖాయం.. కానీ భాగస్వామి ఎవరు?
దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ, ఇటీవల శ్రీలంక ఏ జట్టుపై జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. ఐర్లాండ్తో జరిగే తొలి టీ20లోనే ఈ వండర్ కిడ్ బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, వైభవ్ సూర్యవంశీ కేవలం ఓపెనర్గా మాత్రమే ఆడగలడు. దీంతో తుది జట్టులో అతనికి చోటు కల్పించాలంటే ఓపెనింగ్ స్థానాల్లో భారీ మార్పులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జట్టులో ఉన్న నలుగురు ఓపెనర్ల పోటీని తట్టుకుని వైభవ్తో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించే ఆ మరో లక్కీ ప్లేయర్ ఎవరనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
నంబర్ వన్ స్థానంలో అభిషేక్ శర్మ.. మార్పుకు నో ఛాన్స్!
ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఐసీసీ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్న అభిషేక్ శర్మను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించే ప్రసక్తే లేదు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్లో కొన్ని మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, అతనికున్న హిట్టింగ్ సామర్థ్యంపై యాజమాన్యానికి పూర్తి నమ్మకం ఉంది. పైగా అభిషేక్ శర్మ కూడా లోయర్ ఆర్డర్లో ఆడటం కష్టం. ఈ నేపథ్యంలో, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం కాకుండా, ఇద్దరు విధ్వంసకర లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లయిన అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలే టీమిండియా ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ప్రత్యర్థి బౌలర్లకు పగలే చుక్కలు కనపడటం ఖాయం.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఓపెనర్గా బరిలోకి దించాలనే అభిమానుల కోరికను, జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయక తప్పడం లేదు. మొన్నటి ప్రపంచకప్లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్గా అదరగొట్టి భారత్ను విశ్వవిజేతగా నిలబెట్టడంలో సంజూ కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా అతను ఐదో స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్గా రావాల్సి ఉంటుంది. 2015లోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సంజూ కంటే.. నిన్న మొన్న వచ్చిన అభిషేక్ శర్మ ఎక్కువ మ్యాచ్లు ఆడటం గమనార్హం. అయితే ఈ సిరీస్లో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇప్పటికే తన స్థానాన్ని త్యాగం చేసి మూడో స్థానంలో స్థిరపడటంతో, సంజూ శాంసన్ను ఐదో స్థానానికి పంపడం టీమ్ మేనేజ్మెంట్కు అనివార్యంగా మారింది.
తిలక్ వర్మకు దక్కని చోటు? మిడిలార్డర్ సమీకరణాలు ఇవే..
గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ పర్యటనకు దూరం కావడంతో ఐదో స్థానంలో సంజూ శాంసన్ ఆడటం దాదాపు ఖాయమైంది. దీనివల్ల యువ ఆటగాడు తిలక్ వర్మకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఒకవేళ తిలక్ వర్మను జట్టులోకి తీసుకోవాలనుకుంటే సంజూ శాంసన్ను బెంచ్కే పరిమితం చేయాల్సి ఉంటుంది. ఇక నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఒక పక్క నలుగురు ఓపెనర్ల సందిగ్ధత, మరోపక్క మిడిలార్డర్ స్థానాల సర్దుబాటుతో ఐర్లాండ్ సిరీస్ సెలెక్షన్ నిజంగానే భారత యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..