
Rules Change From July 1: జూన్ నెల ముగింపుకు చేరువవుతోంది, అతి త్వరలో జూలై మాసం ప్రారంభమవుతుంది. కొత్త నెలతో పాటు కొత్త ఖర్చులు, బాధ్యతలు కూడా పెరుగుతాయి.
జూలై 1వ తేదీ నుంచి సామాన్యులపై భారం పడే అవకాశం ఉంది. ఉద్యోగులు, రిటైర్డ్ వ్యక్తులు, పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్ కస్టమర్లు ఈ మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.. లేదంటే ఇది వారి రోజువారీ ఖర్చులపై ప్రభావం చూపుతుంది. జూలై నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
2026 జూలై ఒకటవ తేదీ నుంచి మీ ఆధార్ కార్డుపై ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోవడం మరింత సులభతరం చేశారు. UIDAI కేవలం రూ.75 ఫీజుతో మొబైల్ ఆధార్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడిని మార్చుకునే వెసులుబాటు కల్పించింది. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుంది. మీ ఆధార్ కార్డు వివరాలను సిద్ధంగా ఉంచుకుని సులభంగా మార్చుకోవచ్చు.
జులై ఒకటవ తేదీ నుంచి రైలు టికెట్ లేకుండా ప్రయాణిస్తే అదనపు భారం పడుతుంది. రైల్వే నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఇకపై టికెట్ లేకుండా ప్రయాణించే వారికి రూ. 250 నుంచి రూ.500 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ఇతరుల టికెట్లతో ప్రయాణించడం నేరంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా, రైల్వే ప్రాంగణాల్లో విక్రయదారులు మరియు అడుక్కునే వారిపై కూడా కొత్త నిబంధనలు ఉండనున్నాయి. మహిళల కోసం కేటాయించిన కోచ్లలో పురుషుల ప్రవేశం ఉండదు.
ఇటీవల RBI MPC సమావేశం ప్రకారం.. కొన్ని బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. ఈ జూలై 1వ తేదీ నుంచి ఎఫ్డి వడ్డీ రేట్లలో మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకులు నిరంతరం ఈ వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటాయి. జూలై 1వ తేదీ నుంచి బ్యాంకులు కొత్త వడ్డీ రేట్లను అమలులోకి తీసుకురానున్నాయి.
జులై ఒకటవ తేదీ నుంచి SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కి చెందిన పర్పుల్, ఫోన్ పే క్రెడిట్ కార్డ్, సెలెక్ట్, బ్లాక్ వంటి ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల రివార్డులను సవరించనుంది. రివార్డుల సంపాదనపై ఇకపై పరిమితులు ఉండవచ్చు. కొత్త లావాదేవీల ద్వారా రివార్డులను సంపాదించే అర్హత కూడా మారే అవకాశం ఉంది. ఈ మార్పుల గురించి తెలుసుకోవడానికి క్రెడిట్ కార్డ్ వినియోగదారులు SBI అందించే ప్రత్యేక సమాచారాన్ని ముందుగానే పరిశీలించాలి.
దేశవ్యాప్తంగా జూన్ నెలలోనే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 పెంచారు. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి.. అయితే జూలై నెలలో ఈ ధరల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
ఇరాన్-యూఎస్ యుద్ధ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. దీని ఫలితంగా జూలై ఒకటవ తేదీ నుంచి మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతాయా అని ఆందోళన వ్యక్తమవుతోంది. మే నెలలో ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంచారు, లీటరుకు రూ. 2.46 నుండి రూ. 2.95 వరకు పెంపులు చేశారు.