
ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న తెలంగాణ సీఎస్ రామకృష్ణారావుకు రేవంత్ సర్కార్ అత్యంత కీలకమైన పదవిని కట్టబెట్టనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా..
ఏర్పాటు చేయనున్న తెలంగాణ ఇన్వెస్ట్ సంస్థ ఎండీగా రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ ఇన్వెస్ట్ ను అధికారికంగా కేవలం పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థగా ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ సంస్థను నడిపించేందుకు అనుభవజ్ఞుడైన అధికారి కావాలని భావించిన ప్రభుత్వం, రామకృష్ణారావును ఎంపిక చేసింది.
జూన్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును తెలంగాణ ఇన్వెస్ట్ కు ఎండీగా నియమించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 1991 బ్యాచ్కు చెందిన రామకృష్ణారావుకు.. ఆర్థిక, పాలనా రంగాల్లో అనుభవం, పట్టు ఉన్నాయి. ఆయన నైపుణ్యాలను, సమర్ధతను రిటైర్మెంట్ తర్వాత కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పూర్తిగా వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయంతీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
గత మే నెలలో ఐటీ మరియు పరిశ్రమల శాఖలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ఇన్వెస్ట్ ఏజేన్సీ ఏర్పాటు నిర్ణయం జరిగింది. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, వంటి పొరుగు రాష్ట్రాల పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసిన తరువాత ఇన్వెస్ట్ తెలంగాణ సంస్థ.. గ్లోబల్ ఇన్వెస్టర్లకు వన్-స్టాప్ సొల్యూషన్లా మారనుందని అంటున్నారు.
పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం, విభిన్న ప్రభుత్వ శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, సింగిల్ విండో విధానంలో అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేయడం ఈ ఏజెన్సీ విధులుగా చెబుతున్నారుర. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇందులో ప్రత్యేకంగా ఒక ఇన్వెస్ట్ సెల్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఉత్తర కొరియా చరిత్రలోనే అతిపెద్ద అణు యుద్ధనౌక లాంచ్.. కిమ్ సంచలనం
.