
India vs Ireland T20 Series: భారత క్రికెట్ జట్టు గత రెండు టీ20 ప్రపంచకప్లలో అద్భుతమైన ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలిచింది.
2024లో రోహిత్ శర్మ సారథ్యంలో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకోగా, ఆ తర్వాత 2026లో సూర్యకుమార్ యాదవ్ కప్ గెలిపించి చరిత్ర సృష్టించారు. వరుసగా రెండుసార్లు ఈ పొట్టి ఫార్మాట్లో ఛాంపియన్గా నిలిచిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అయితే, చరిత్ర అక్కడితో ఆగిపోదు. ఇప్పుడు సెలక్టర్ల చూపు 2028 టీ20 ప్రపంచకప్పై పడింది. అందుకోసం ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలు అత్యంత కీలకంగా మారాయి. గాయాలు, ఆటగాళ్ల మార్పుల మధ్య ఈ పర్యటన కోసం జట్టును ఎంపిక చేశారు. అయితే ఈ సిరీస్ కొందరు ఆటగాళ్లకు జీవన్మరణ సమస్యగా మారింది.
1. వాషింగ్టన్ సుందర్: ఆల్రౌండర్ స్థానానికి ఎసరు?: ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. 2026 టీ20 ప్రపంచకప్లోనూ, ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2026 సీజన్లోనూ సుందర్ ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్తో అక్కడక్కడా ఫర్వాలేదనిపించినా, బౌలింగ్లో మాత్రం జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అయినప్పటికీ సెలక్టర్లు అతనికి మరో అవకాశం ఇచ్చారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లో సుందర్ కచ్చితంగా తన బౌలింగ్, బ్యాటింగ్ నైపుణ్యాలను నిరూపించుకోవాల్సిందే. ఇందులో కనుక విఫలమైతే, సెలక్టర్లు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల వైపు చూడటం ఖాయం. దీనితో అతనికి 2028 ప్రపంచకప్ రేసు నుంచి తలుపులు మూసుకుపోయినట్లే.
2. ప్రసిద్ధ్ కృష్ణ: లక్కీ ఛాన్స్.. నిలబెట్టుకుంటాడా?: ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు ఈ పర్యటన ఒక రకంగా వరమనే చెప్పాలి. నిజానికి ఐపీఎల్ 2026 లో నిలకడలేని ప్రదర్శన కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించారు. అయితే, సీనియర్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకోవడంతో ప్రసిద్ధ్ కృష్ణకు ఊహించని విధంగా జట్టులో చోటు దక్కింది. దక్కిన ఈ సువర్ణ అవకాశాన్ని అతను రెండు చేతులా ఒడిసి పట్టుకోవాలి. ఇంగ్లాండ్ వంటి పిచ్లపై తన వేగంతో, బౌన్స్తో వికెట్లు తీసి మెప్పించాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక లైన్ అండ్ లెంగ్త్ తప్పితే, భవిష్యత్తులో భారత జట్టు జెర్సీని ధరించడం అతనికి కష్టంగా మారుతుంది.
3. రవి బిష్ణోయ్: స్పిన్ సత్తా చాటాల్సిన సమయం..: లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్కు టీమిండియా టీ20 జట్టులోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. కుల్దీప్ యాదవ్కు విశ్రాంతి ఇవ్వడం, వరుణ్ చక్రవర్తి గాయపడటంతో బిష్ణోయ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారు. మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటూ, గూగ్లీలతో ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పలు పెట్టే బిష్ణోయ్.. గత కొన్ని మ్యాచ్లుగా ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. 2028 ప్రపంచకప్ ప్రణాళికల్లో ప్రధాన స్పిన్నర్గా నిలవాలంటే ఈ 7 మ్యాచ్లు అతనికి ఎంతో కీలకం. వికెట్లు తీస్తూ పరుగులను కట్టడి చేస్తేనే జట్టులో స్థానం పదిలమవుతుంది, లేదంటే బెంచ్కే పరిమితం కాక తప్పదు.
భారత క్రికెట్లో పోటీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో స్థానం కోసం నలుగురైదుగురు యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో లభించిన అవకాశాలను జారవిడుచుకుంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ శాయశక్తులా పోరాడి ఫామ్ను నిరూపించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి వీరు సత్తా చాటి 2028 ప్రపంచకప్ ఆడిషన్స్ జాబితాలో నిలుస్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.