
ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన ప్రతి చిన్నారి చేతికి ఇకపై బంగారు ఉంగరం మెరవ నుంది. మాతా, శిశు సంక్షేమా నికి పెద్దపీట వేస్తూ తమిళ నాడు ప్రభుత్వం వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి బిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని ఉచితంగా బహూకరించే ‘తాయా మామన్ తంగ మోదిరమ్ తిట్టమ్’ (మేనమామ బంగారు ఉంగరం పథకం) అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది.
సాధారణంగా పుట్టిన బిడ్డకు కుటుంబ సభ్యులు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీ. అయితే అదే సంప్రదాయాన్ని ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించే ప్రతి శిశువుకు ఎలాంటి వివక్ష లేకుండా ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని అందించనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 755.83 కోట్ల రూపాయలు కేటాయించనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లి-శిశు ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన ప్రతి చిన్నారికి బంగారు ఉంగరం బహుమతిగా ఇవ్వడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం మరో వినూత్న సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
.