
బెజవాడ(Vijayawada) రాజకీయం మరోసారి కేశినేని సోదరుల సంచలన ఆరోపణలతో అగ్గిరాజేస్తోంది. పోలవరం కుడి కాల్వ మట్టి తవ్వకాల స్కామ్ (Polavaram Right Canal Soil Excavation Scam) వ్యవహారంపై విజయవాడ ఎంపీ...
బెజవాడ(Vijayawada) రాజకీయం మరోసారి కేశినేని సోదరుల సంచలన ఆరోపణలతో అగ్గిరాజేస్తోంది. పోలవరం కుడి కాల్వ మట్టి తవ్వకాల స్కామ్ (Polavaram Right Canal Soil Excavation Scam) వ్యవహారంపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)(Kesineni Chinni) ఘాటుగా స్పందించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిని ‘ఫేక్ నాయకులు’, ‘ఫేక్ పార్టీ’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఎంపీ కేశినేని చిన్ని, తనపై బురదజల్లడమే ధ్యేయంగా కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
“సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో పోస్టులు పెట్టడం, ఆ తర్వాత దొరికిపోయి మొహం చాటేయడం వారికి అలవాటుగా మారింది. ఇలాంటి చౌకబారు రాజకీయాలకు నేను భయపడను” అని స్పష్టం చేశారు. పోలవరం కుడి కాల్వలో రూ. 350 కోట్ల మేర మట్టిని లూటీ చేశారంటూ వస్తున్న ఆరోపణలపై చిన్ని టెక్నికల్ క్లారిటీ ఇచ్చారు. “కాల్వలో లూటీ జరిగింది నిజమే.. కానీ అది ఇప్పుడు కాదు, 2023లో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వేసి దోచుకున్నారు.
నాటి స్కామ్ను దాచిపెట్టి, ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో తవ్వకాలు జరుగుతున్నట్లు తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం” అని కేశినేని చిన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కేశినేని నాని ఈడీ (ED) కి ఫిర్యాదు చేయడం, సీబీఐ విచారణ కోరడంపై చిన్ని ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గతం నుంచే ఇరు సోదరుల మధ్య వివాదం నడుస్తుండగా, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నందుకు ఇప్పటికే పటమట పోలీస్ స్టేషన్లో నానిపై ఐటీ యాక్ట్ కింద కేసు కూడా నమోదైంది. 2023 నాటి మట్టి దోపిడీ వెనుక ఉన్న అసలు దొంగలెవరో ప్రజలందరికీ తెలుసని, నిజాలు త్వరలోనే నిరూపితమవుతాయని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు.