%2520(1)(1).webp&w=3840&q=75)
అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య రోజురోజుకూ తీవ్రమవుతున్న సైనిక ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణకిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ
ఒప్పందానికి ఇప్పటివరకు ఎదురైన అత్యంత పెద్ద సవాలుగా ఈ ప్రస్తుత పరిణామాలు నిలిచాయి. ఇరు దేశాల మధ్య ఘర్షణలు మరింత ముదిరి, పరిస్థితి పూర్తిగా చేదాటిపోతుందనే భయాల నడుమ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణం కేవలం ఆయా దేశాలకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది.
ప్రముఖ అంతర్జాతీయ ఇంధన పరిశోధన సంస్థ రిస్టాడ్ ఎనర్జీ తన తాజా నివేదికలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఒకవేళ అమెరికా-ఇరాన్ల మధ్య తిరిగి పూర్తిస్థాయి సాయుధ ఘర్షణ గాని ప్రారంభమైతే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఏకంగా బ్యారెల్కు 150 డాలర్ల రికార్డు స్థాయికి చేరుకోవచ్చని హెచ్చరించింది. ఈ భయాందోళనలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇన్వెస్టర్లలో ఆందోళన పెరగడంతో మార్కెట్లపై తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది. ఈ తీవ్ర అనిశ్చిత పరిస్థితి ఇంధన మార్కెట్లో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకానొక దశలో బ్యారెల్కు 94.5 డాలర్లకు ఎగబాకింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గి ప్రస్తుతం బ్యారెల్కు 93 డాలర్ల వద్ద స్థిరపడింది.
ఈ యుద్ధ వాతావరణం వల్ల గల్ఫ్ ప్రాంతంలోని ఆరు ప్రధాన చమురు ఉత్పాదక దేశాలలో రోజుకు సుమారు 11.8 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఆధునిక ప్రపంచ చరిత్రలోనే చమురు సరఫరా వ్యవస్థకు తగిలిన అతిపెద్ద దెబ్బగా దీనిని రిస్టాడ్ ఎనర్జీ అభివర్ణించింది. ప్రస్తుత ఉద్రిక్తతలు చివరకు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తాయా లేదా ఇంకా నియంత్రించగలిగే పరిధిలోనే ఉన్నాయా అని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని రిస్టాడ్ ఎనర్జీ జియోపొలిటికల్ అఫైర్స్ హెడ్ జార్జ్ లయన్ విశ్లేషించారు. కొన్ని వారాల క్రితం వరకు అమెరికా, ఇరాన్ల మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు 40 శాతం వరకు ఉండేవని, కానీ ప్రస్తుత దాడుల పరంపరతో ఆ ఆశలు పూర్తిగా సన్నగిల్లాయని రిస్టాడ్ ఎనర్జీ ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే ప్రస్తుతానికి చమురు మార్కెట్ పూర్తిగా అదుపు తప్పకుండా కొన్ని కీలక అంశాలు నిరోధిస్తున్నాయి. మొదటిది, యునైటెడ్ స్టేట్స్ తన వ్యూహాత్మక చమురు నిల్వల నుండి రికార్డు స్థాయిలో ముడి చమురును మార్కెట్లోకి విడుదల చేస్తూ సరఫరా కొరతను భర్తీ చేస్తోంది. రెండవది, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగదారు అయిన చైనా తన ముడి చమురు దిగుమతులను కొంతవరకు తగ్గించుకోవడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఒత్తిడి కొద్దిగా తగ్గింది. ఇక మూడవది, ఇరాన్ పట్టున్న హోర్ముజ్ జలసంధిని దాటవేస్తూ సౌదీ అరేబియాలోని యాన్బు పోర్ట్ ద్వారా ప్రతిరోజూ సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును సురక్షితంగా రవాణా చేస్తుండటం గ్లోబల్ మార్కెట్కు కొంత ఉపశమనాన్ని ఇస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం.. అదృష్టవశాత్తు తప్పిన ముప్పు
పసిడి ప్రియులకు బంపర్ ఆఫర్: నేడు బంగారం, వెండి ధరల భారీ పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే!
.