
తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉండి.. ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకున్న కవిత.. ఇటీవలి కాలంలో
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన విమర్శలపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు. తాజాగా రెండు రోజుల కిందట హైదరాబాద్ లో కురిసిన వర్షానికి విశ్వనగరంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో గప్పాలు కొట్టుకున్న మహానగరం అతలాకుతలమైన సంగతిని ప్రస్తావిస్తూ.. నెటిజనులు టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) అధినేత్రి కవితను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
తెలంగాణ గడ్డపై భాగ్యనగరం విశ్వనగరంగా, గ్లోబల్ ఐటీ హబ్గా ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు, ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలతో హైదరాబాద్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. కానీ, ఇంతటి మహానగరం ఒక్క అరగంట పాటు కురిసే వర్షానికే కుదేలైపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ కవితను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అమరావతిని కవిత వరద ప్రాంతమంటూ ఎద్దేవా చేయడాన్ని తప్పుపడుతున్నారు. వానాకాలం వస్తే అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి సీటు కిందకు నీళ్లు చేరకుండా చూసుకోండి అంటూ ఇటీవల కవిత అవహేళన చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా.. వర్షాకాలం మొదలైతే అమరావతిలో ప్రయాణించడానికి పడవలు వాడాలా అంటూ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు హైదరాబాద్లో ఒక్క గంట వర్షానికి ఐటీ కారిడార్ అంతా జలమయం కావడంతో.. నెటిజన్లు కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమెపై తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు. పక్క రాష్ట్ర రాజధాని గురించి వెటకారాలు తరువాత.. ముందు మీ నగరానికి వర్షాల నుంచి రక్షణ కల్పించుకో కవితక్కా అంటూ ఓ నెటిజన్ సలహా ఇవ్వగా.. గత పదేళ్ల మీ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో మీరు చేసిన అద్భుతమైన అభివృద్ధి ఇదేనా? అంటూ మరో నెటిజనుడు నిలదీశారు.
ప్రత్యేక తెలంగాణ వస్తే బంగారు తెలంగాణగా మారుస్తామని మీ తండ్రి కేసీఆర్ చేసిన ప్రకటనల పరమార్థం ఇదేనా? ఇదేనా అంటూ మరి కొందరు ప్రశ్నించారు. వర్షం వస్తే ఇప్పుడు హైదరాబాద్లోనే పడవలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ పాత వీడియోలను, మీమ్స్ను షేర్ చేస్తూ కల్వకుంట్ల కవితపై నెటిజనులు విరుచుకుపడుతున్నారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసు.. రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసిన ఈడీ
.