
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఒక వైపు పాన్ ఇండియా విజయాలతో ఊపు మీదున్నట్లు కనిపిస్తున్నా, లోపల మాత్రం బడ్జెట్ భారంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. మితిమీరిన బడ్జెట్ అంటే కష్టాలను కొనితెచ్చుకోవడమే
అని తెలిసినా.. టాలీవుడ్ మేకర్స్ ఆ ఊబిలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ‘పాన్ ఇండియా’ అనే మాయలో పడి ప్రతి సినిమాకు వందల కోట్లు గుమ్మరిస్తున్నారు. విజువల్ వండర్, గ్రాఫిక్స్, భారీ సెట్స్ పేరుతో వీఎఫ్ఎక్స్ పై పెడుతున్న ఖర్చు నిర్మాతలకు తడిసి మోపెడవుతోంది.
ఒకప్పుడు ఏడాదిలో పూర్తయ్యే సినిమాలు ఇప్పుడు రెండు మూడు ఏళ్ల పాటు సాగుతున్నాయి. సమయం పెరిగేకొద్దీ వడ్డీలు, ప్రొడక్షన్ కాస్ట్లు పెరిగిపోయి నిర్మాతలు కోలుకోలేని దెబ్బ తింటున్నారు. సినిమా బడ్జెట్లో దాదాపు సగం వాటా కేవలం హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్కే సరిపోతుండటం గమనార్హం. కొందరు స్టార్ హీరోలు రెండు సినిమాలకు తీసుకునే పారితోషికాన్ని ఒక్క సినిమాకే డిమాండ్ చేస్తున్నారు. స్టార్స్ సినిమాల బడ్జెట్ ఇప్పుడు రూ. 300 నుండి 500 కోట్లకు చేరింది. విచిత్రం ఏమిటంటే మార్కెట్ లేని లేదా కనీసం రూ. 100 కోట్ల వసూళ్ల ట్రాక్ రికార్డ్ లేని యంగ్ హీరోల సినిమాల బడ్జెట్ కూడా వంద కోట్లు దాటిపోతోంది. క్రేజ్ లేని హీరోలపై వందల కోట్లు కుమ్మరించడం నిర్మాతలకు ఆత్మహత్యాసదృశ్యంగా మారుతోంది. ఓటీటీ రైట్స్ ఆశించిన స్థాయిలో అమ్ముడుపోకపోతే థియేట్రికల్ రిలీజ్ కూడా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం యష్ నటిస్తున్న ‘టాక్సిక్’, చిరంజీవి ‘విశ్వంభర’ వంటి భారీ చిత్రాలు కూడా ఇలాంటి బిజినెస్ ఒత్తిడిల మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది.
పెరిగిన బడ్జెట్ను రికవరీ చేయడం కోసం నిర్మాతలు టికెట్ రేట్ల పెంపు పైనే ఆధారపడుతున్నారు. కానీ ఇది రివర్స్ కొడుతోంది. మితిమీరిన ధరల వల్ల కామన్ ఆడియన్ థియేటర్లకు పూర్తిగా దూరమవుతున్నాడు. నష్టాలకు, కష్టాలకు మితిమీరిన బడ్జెట్ మరియు పారితోషికాలే ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తున్నా.. ఇండస్ట్రీ మాత్రం “తగ్గేదేలే” అంటూ అదే తప్పును పునరావృతం చేస్తోంది. ఇప్పటికైనా నిర్మాతలు కళ్ళు తెరిచి బడ్జెట్లను అదుపులో పెట్టుకోకపోతే టాలీవుడ్ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.