అది మారుమూల గిరిజన గ్రామం.. సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని ఊరు.. ఎవరైనా నడుచుకుంటూ అక్కడికి చేరుకోవాల్సిందే. ఆ గ్రామానికి చెందిన ఓ స్కూల్ విద్యార్థిని హాస్టల్లో ఉండి చదువుకుంటోంది..
ఆమెకు తండ్రి చనిపోయాడు, బాబాయి సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ఇంతలో బాలిక జ్వరంతో బాధపడుతోంది.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా కోలుకోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. ఇంతలో బాలిక మళ్లీ అనారోగ్యానికిగురికాగా.. స్కూల్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే హాస్టల్ వార్డెన్ హేమని నడుచుకుంటూ ఆమె ఇంటికి వెళ్లారు.. బాలిక పరిస్థితిని చూసి చలించిపోయి భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు లేని ఆ పాపకు వార్డెన్ హేమని తల్లిలా అండగా నిలిచారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టికి చెందిన భువనేశ్వరి భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. తండ్రి మరణం తర్వాత బాబాయి సంరక్షణలో ఉంటున్నారు. ఇటీవల స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన భువనేశ్వరికి జర్వం వచ్చింది.. కుటుంబ సభ్యులు కురుపాం ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. బాలిక కోలుకోవడంతో ఇంటికి తీసుకొచ్చారు.. కానీ బాలిక మళ్లీ అనారోగ్యానికిగురైనట్లు స్కూల్ సిబ్బందికి సమాచారం వచ్చింది. ఏటీడబ్ల్యూవో రజిని సూచించడంతో హాస్టల్ వార్డెన్ హేమని మూడు రోజుల క్రితం బాలిక ఇంటికి వెళ్లారు. భువనేశ్వరి ఆరోగ్య పరిస్థితి చూసి హేమని చలించిపోయారు.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.బాలిక సొంత ఊరైన వాడపుట్టికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వార్డెన్ హేమని తాత్కాలికంగా డోలీని తయారుచేశారు. ఆ బాలికను తన నడుముకు కట్టుకుని మోనుకుంటూ సుమారు మూడు కిలోమీర్లు కాలినడకన నెల్లికెక్కువ వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి పాపను వాహనంలో పార్వతీపురం ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్చగా.. అక్కడ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. వార్డెన్ హేమని భువనేశ్వరిని కూతురిలా భావించి తల్లిలా తన భుజాలపై మోసుకుంటూ సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లారు. హేమని అంకితభావాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. హేమని నిస్వార్థ సేవను గుర్తించి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాలువాతో సత్కరించి.. ఆమె మానవతా దృక్పథాన్ని అభినందించారు. స్థానికులు వార్డెన్ హేమనిని ప్రశంసించారు.