తిరుమల శ్రీవారిపై భక్తితో తలనీలాలు సమర్పించిన తనపై అవమానకర పోస్టులు పెట్టడం బాధగా ఉందన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి . తనపై వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేదికగా దారు
ణంగా పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు మహిళల్ని కించపరడాన్ని రాజకీయంగా భావిస్తున్నారని.. ఇలా మహిళల్ని అవమానించే రాజకీయ సంస్కృతి సరికాదనే ప్రజలు వారిని తిరస్కరించారన్నారు. తిరుమలలో శ్రీవారికి భక్తి విశ్వాసంతో తలనీలాలు సమర్పిస్తే.. దానిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకోవడం వైఎస్సార్సీపీ దిగజారుడుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేవారు. ఈ అనుచిత వ్యాఖ్యల్ని సమర్థిస్తున్న వైఎస్సార్సీపీలో ఉన్న మహిళా నేతలు ఒకసారి తమ వైఖరిని పునఃపరిశీలించుకుంటే మంచిదన్నారు.ఈ రాష్ట్రానికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేనివారు చాలాప్రమాదకరమన్నారు మాధవి. మహిళా నేతల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విధానపరమైన అంశాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయాల్సిందిపోయి.. మహిళల వ్యక్తిగ జీవితం, అలంకరణ, దుస్తులు, భక్తి విశ్వాసాలను టార్గెట్ చేసి మాట్లాడటం వైఎస్సార్సీపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. మహిళల్ని అవమానించి రాజకీయంగా వెనక్కు తోసేద్దామని భావించడం అవివేకానికి నిదర్శమన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికైనా పద్దతి మార్చుకుంటే బావుంటుందని హితవు పలికారు.గుడివాడ అమర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని వైఎస్సార్సీపీ నేతలు సమర్థిస్తున్నారని.. కుల ప్రస్తావన తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారని మాధవి వ్యాఖ్యానించారు. అమర్నాథ్ను తల్లి పెంచి పెద్ద చేశారు.. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. మహిళల పట్ల గౌరవం ఉందని ఆయన చెబుతుంటారు.. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం దారుణంగా ఉన్నాయన్నారు. తన విషయంలోనూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారంటే వారి ఆలోచనా విధానం ఎలా ఉందో తెలుస్తోందన్నారు. తప్పు చేసి కూడా వ్యగ్యంగా సమర్థించుకునేవారు రాజకీయ నాయకులా.. మహిళల పట్ల వారికి అసలు గౌరవం ఉందా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవి. గళ్లా మాధవి గతవారం తిరుమల శ్రీవారిక తలనీలాలు సమర్పించారు.. అయితే తనను సోషల్ మీడియాను ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.