
దేశంలో తొలిసారిగా హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) విధానంలో గ్రామీణ రహదారుల నిర్మాణం, అభివృద్ధి చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ భారీ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా తొలి దశ రహదారి పనులకు ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు.రాష్ట్రంలో తండాలు, గూడేలు సహా మొత్తం 12,848 గ్రామాలు ఉండగా.. ప్రస్తుతం 12,514 గ్రామాలకు రహదారి సౌకర్యం ఉంది. ఇంకా 334 గ్రామాలకు పూర్తిస్థాయి రోడ్డు కనెక్టివిటీ అందుబాటులో లేదు. ఇప్పటివరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 68,708 కిలోమీటర్ల మేర సీసీ, తారురోడ్లు ఉన్నాయి. అయితే రహదారి వ్యవస్థలో ఇంకా అంతరం కొనసాగుతోంది. దాదాపు 19,030 కిలోమీటర్ల మేర మట్టి రోడ్లు, 7,377 కిలోమీటర్ల మేర మట్టి-కంకర రోడ్లు, మరో 12,010 కిలోమీటర్ల మేర కంకర రోడ్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వర్షాకాలంలో వీటి పరిస్థితి మరింత అధ్వానంగా మారడం, రవాణా ఇబ్బందులు తలెత్తడం, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంలో సమస్యలు ఎదురవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని హ్యామ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.మూడు దశల్లో 18,472 కి.మీ...హ్యామ్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో మొత్తం 18,472 కిలోమీటర్ల రహదారులను నిర్మించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా తొలిదశలో 2,145 రహదారులకు సంబంధించి 7,448 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. ఈ దశ పూర్తయితే గ్రామీణ రవాణా వ్యవస్థలో కీలకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తొలి దశలో 176 గ్రామపంచాయతీలకు మొదటిసారిగా బీటీ రోడ్ల సౌకర్యం కల్పించనున్నారు. వీటి కోసం సుమారు 934 కిలోమీటర్ల మేర కొత్త బీటీ రోడ్లు నిర్మించనున్నారు. దీంతో ఇప్పటివరకు సరైన తారురోడ్డు సౌకర్యం లేని అనేక గ్రామాలు ప్రధాన రహదారి వ్యవస్థతో కనెక్ట్ చేయనున్నారు.అదే సమయంలో ఇప్పటికే ఉన్న బీటీ రోడ్లలో సుమారు 5,490 కిలోమీటర్ల మేర బలోపేతం, మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. అధిక రద్దీ ఉన్న సింగిల్ లేన్ రహదారులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపు 1,024 కిలోమీటర్ల సింగిల్ లేన్ బీటీ రోడ్లను ఇంటర్మీడియట్ లేన్ రోడ్లుగా విస్తరించనున్నారు. దీంతో వాహనాల రాకపోకలు సులభతరం కావడంతో పాటు రహదారి భద్రత మెరుగుపడే అవకాశం ఉంది. మొత్తంగా తొలిదశ హ్యామ్ రోడ్ల పనుల ద్వారా 3,036 గ్రామపంచాయతీలు ప్రయోజనం పొందనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి వ్యవస్థ ఏర్పడితే వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్ సదుపాయాలకు ప్రజల చేరువ కానున్నాయి. రోడ్డు సౌకర్యం లేని 334 గ్రామాలకు భవిష్యత్లో కనెక్టివిటీ కల్పించడంతో పాటు ఇప్పటికే ఉన్న రహదారులను ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.






