కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు, ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
నల్గొండ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరుకాకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. తన సోదరుడు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా సభ నిర్వహించినా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. కేబినెట్ విస్తరణలో జరుగుతున్న జాప్యమే ఆయన గైర్హజరుకు ప్రధాన కారణమనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు ముగుస్తున్నా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్నా.. ఇప్పటికీ మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదించి హైకమాండ్ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కదలిక లేదు. సాధారణంగా ప్రభుత్వం సగం పదవీకాలం ముగించుకున్న తర్వాత పనితీరును సమీక్షించి, డిసెంబర్ నాటికి విస్తరణతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా చేపట్టే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కొన్ని రంగాల్లో ప్రభుత్వ పనితీరుపై హైకమాండ్ పూర్తిగా సంతృప్తిగా లేనందున.. అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ఎన్నికల సమయంలో పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ ఆ హామీ నిలబెట్టుకోలేదు. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని ఆయన మద్దతుదారులు, అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు కేటాయించినప్పుడు.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు కూడా మూడు పదవులు ఇవ్వటంలో తప్పులేదని వారు వాదిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మంత్రివర్గంలో ఉండటంపై ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ పార్టీకి చాలా సేవలు చేశారని ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు. మరోవైపు కేబినెట్ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ చేపడితే కొత్త సమస్యలు వస్తాయనే భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కుల సమీకరణాలు, సామాజిక న్యాయం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సీనియారిటీ వంటి అనేక అంశాలను సమతుల్యం చేయడం ముఖ్యమంత్రి ముందున్న అతి పెద్ద సవాల్. అందుకే ఇంకా కేబినెట్ విస్తరణ చేపట్టడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ సుదీర్ఘ నిరీక్షణతో విసిగిపోయినందునే.. తన సోదరుడు వెంకట్ రెడ్డి స్వయంగా నిర్వహించిన సభ అయినప్పటికీ రాజగోపాల్ రెడ్డి నల్గొండ మీటింగ్కు దూరంగా ఉండి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక సభ రోజున రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపడానికి సిద్ధమైన ఆయన అనుచరులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వరుస పరిణామాలన్నీ గమనిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందని దీనివల్ల తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోందని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.