
‘‘ఈ రోజుల్లో సినిమాల స్థాయి కంటే కూడా కథలే కీలకం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సింగ్ గీతం’, ‘బ్లాస్ట్’, ‘మా ఇంటి బంగారం’ చిత్రాలు అద్భుతమైన విజయాల్ని అందుకున్నాయి.
అదే వరసలోనే ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ నిలుస్తుందని నా నమ్మకం’’ అన్నారు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన, కథానాయకుడు సత్యదేవ్, దర్శకుడు కరుణాకరన్, నిర్మాతలు వై.రవిశంకర్, బన్నీ వాస్, ఎస్.కె.ఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి ముఖ్య అతిథులుగా ‘గుర్తుకొస్తున్నాయి’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక జరిగింది. విరాజ్ అశ్విన్ కథానాయకుడిగా... వినోద్ గాలి దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ ఇది. శరత్ చంద్రనాయుడు నిర్మాత. జులై 3 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుందీ సిరీస్. వేడుకని ఉద్దేశించిన బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘ఈ సిరీస్ విడుదలకు ఈటీవీ విన్ వేదికని ఎంచుకోవడమే ఒక విజయం. ఈటీవీ విన్, గీతా ఆర్ట్స్ అత్యుత్తమమైన కథల్ని అందించే సంస్థలు. అక్కణ్నుంచి వస్తున్న ఈ సిరీస్ పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
కథానాయకుడు సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘ఈ రోజుల్లో వెబ్సిరీస్లు, సినిమాల మధ్య గీత చెరిగిపోయింది. మంచి కథ ఎక్కడ ఉన్నా సరే... ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈటీవీ విన్ వేదిక నుంచి అలాంటి అద్భుతమైన కథలెన్నో వస్తున్నాయి.అందులో ‘గుర్తుకొస్తున్నాయి’ కూడా ఒకటి కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. కథానాయకుడు విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘జీవితాల్లోని ఎన్నెన్నో భావోద్వేగ క్షణాలతో రూపొందిన సిరీస్ ఇది. భావోద్వేగాలతోపాటు, హాస్యం కూడా బలమైన ప్రభావం చూపిస్తుంది’’ అన్నారు. నిర్మాత శరత్చంద్ర నాయుడు మాట్లాడుతూ ‘‘నేను మొదట అల్లు అర్జున్ దగ్గర ఉంటూ ఆయన సోషల్ మీడియాని హ్యాండిల్ చేశా. ఆ తర్వాత పలు బాధ్యతల్ని నిర్వర్తించి, ఈటీవీ విన్లో సిరీస్ నిర్మించడం వరకూ వచ్చా. ఇదంతా అల్లు అర్జున్ ప్రోత్సాహం, సహకారంతోనే సాధ్యమైంది’’ అన్నారు. ఈ సిరీస్లో తొలి ఎపిసోడ్ని ఉచితంగానే చూడొచ్చని, పేరులాగే ఎప్పటికీ గుర్తుంటుందీ సిరీస్ అన్నారు ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.