అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరఫున బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హసనైన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి...
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరఫున బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హసనైన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్ఘరీటా హాజరుకానున్నట్టు ఇరాన్ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది. జులై 5 నుంచి 9 వరకు జరగబోయే ఖమేనీ అంత్యక్రియలకు.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇరాన్ ప్రభుత్వం తరఫున ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.అయితే ఆ సమయంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టూర్ ఇప్పటికే ఖరారయ్యింది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు మోదీ హాజరు కాలేకపోతున్నారు. ఈ షెడ్యూల్ ముందుగానే ఖరారైందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఇక, ఇరాన్ వ్యాప్తంగా పలు నగరాల్లో ఐదు రోజుల పాటు జరగనున్న ఖమేనీ అంత్యక్రియలకు లక్షలాది ప్రజలు, పలు దేశాల ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు టెహ్రాన్లో ప్రారంభమై, షియా వర్గానికి అత్యంత పవిత్ర నగరాలలో ఒకటి, అయతుల్లా అలీ ఖమేనీ జన్మస్థలమైన మషద్లో ఆయన అంత్యక్రియలతో ముగుస్తాయి. ఫిబ్రవరి 28న టెహ్రాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులలో ఖమేనీ హతమయ్యారు. ఇరాన్ అధికారుల ప్రకారం.. ప్రజల సందర్శనార్థం ఖమేనీ మృతదేహాన్ని జులై 4, 5 తేదీలలో టెహ్రాన్ గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్లో ఉంచుతారు. తమ అభిమాన నేతను కడసారి చూసి, నివాళులర్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 6న అంత్యక్రియల ఊరేగింపు షెడ్యూల్ చేశారు. అధికారిక సంతాప సమయంలో టెహ్రాన్ ప్రావిన్సుల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించారు. కాగా, ఖమేనీకి ఐదు రోజుల పాటు అంత్యక్రియలు నిర్వహించడానికి కారణాలు ఉన్నాయి. ఇస్లాం సంప్రదాయం ప్రకారం వ్యక్తి మరణించిన 24 గంటల్లోపు అంత్యక్రియలు పూర్తి చేయాలి. కానీ ఖమేనీ వంటి ప్రభావం ఉన్న నాయకుడి విషయంలో కొన్ని మినహాయింపులు ఉంటాయి.