
Telangana Rain Alert : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
అయితే, వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు వర్షాలు కురవకపోడంతో రైతులు సాగు పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు నాటాలంటే భూమిలో సరిపడా తేమ ఉండాలి.. ఆ స్థాయిలో వర్షాలు కురవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవటంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు విత్తనాలు నాటేందుకు వెనుకాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని రైతులకు వాతావరణ శాఖ అధికారులు శుభవార్త చెప్పారు.
నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వారంరోజులపాటు వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇవాళ అదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాయంత్రం 6గంటల తరువాత హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని, రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వర్షాలతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు వద్ద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.