
మీరు కూడా ఏటీఎంను ఉపయోగిస్తుంటారా.? బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయి, ఏటీఎం నుంచి నగదు రాని సందర్భాన్ని ఎప్పుడైనా ఎదుర్కొన్నారా.?
అయితే ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, రీఫండ్ ఎలా పొందాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం ఆలస్యమైన రీఫండ్ కోసం బ్యాంకులకు విధించే ఫైన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో బ్యాంకింగ్ లావాదేవీలు చాలా సులువుగా మారాయి. గతంలో చిన్న పని కోసం కూడా బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది, ఇది సమయాన్ని వృథా చేసేది. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీయడానికి వెళ్లినప్పుడు, మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయి కానీ ఏటీఎం నుంచి నగదు రాలేదా? ఇలాంటి పరిస్థితిలో చాలా మంది కంగారుపడతారు. డబ్బులు పోయాయని అనుకుంటారు. కానీ కంగారుపడకుండా, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం ముఖ్యం.
ఏటీఎం నుంచి డబ్బులు రానప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముందుగా, మరోసారి ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రయత్నించవద్దు. మీ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చెక్ చేయండి. దీని ద్వారా మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయో లేదో తెలుస్తుంది. డబ్బులు డెబిట్ అయినట్లయితే, తీసిన మొత్తం, ఏటీఎం స్థలం, లావాదేవీ సమయం వంటి అన్ని లావాదేవీ సంబంధిత సమాచారాన్ని మీ వద్ద ఉంచుకోండి. మీరు ఫిర్యాదు చేసినప్పుడు ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది.
మీ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యి, ఏటీఎం మెషిన్ నుండి నగదు బయటకు రాకపోతే ఆలస్యం చేయకుండా బ్యాంకును సంప్రదించండి. ఫిర్యాదు నమోదు చేయగానే, బ్యాంక్ మీకు ఒక కంప్లైంట్ నంబర్ను ఇస్తుంది. ఈ నంబర్ను భద్రంగా ఉంచుకోండి, ఇది భవిష్యత్తులో మీ ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడానికి, తదుపరి చర్యలకు ఉపయోగపడుతుంది.
ఫిర్యాదు అందిన తర్వాత, బ్యాంక్ ఏటీఎం రికార్డులతో పాటు లావాదేవీలకు సంబంధించిన లాగ్లను పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియలో ఏటీఎం నుంచి డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకుంటారు. బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయని, కానీ ఏటీఎం మెషిన్ నుంచి డబ్బులు రాలేదని విచారణలో తేలితే, ఆ మొత్తాన్ని కస్టమర్ ఖాతాలోకి తిరిగి జమ చేస్తారు.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఏటీఎం నుంచి డబ్బులు రాకపోయినా ఖాతా నుంచి కట్ అయితే, బ్యాంక్ విచారణ పూర్తి చేసిన తర్వాత కస్టమర్ డబ్బును తిరిగి ఇవ్వాలి. ఒకవేళ బ్యాంక్ 5 పని దినాలలోపు డబ్బును తిరిగి ఇవ్వడంలో విఫలమైతే, కస్టమర్ పరిహారం పొందే హక్కును కలిగి ఉంటారు. ఇలాంటి సందర్భాలలో, బ్యాంక్ కస్టమర్కు రోజుకు 100 రూపాయల జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అయితే, కస్టమర్ ఫిర్యాదు చేసి, ఫిర్యాదు రిఫరెన్స్ నంబర్ ఉన్నప్పుడే బ్యాంక్ ఈ పరిహారాన్ని ఇస్తుందని గుర్తుంచుకోండి.
బ్యాంక్ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోతే, కస్టమర్ కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవచ్చు. కస్టమర్ బ్యాంక్ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఆశ్రయించవచ్చు. అలాగే, ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మన్ పథకం కింద కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి సంఘటన మీకు ఎదురైతే, ముందుగా కంగారుపడకండి. వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వండి. చాలా సందర్భాలలో డబ్బులు తిరిగి వస్తాయి. మీరు సకాలంలో బ్యాంకుకు సమాచారం ఇస్తే, డబ్బులు తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.