అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై జ్యోతిర్మఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్రంగా స్పందించారు. అసలు దొంగలను వదిలేశారని, బీజేపీది నకిలీ హిందుత్వ అని, అందులోని ఉండేవారు
నకిలీ హిందువులని సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిధుల వ్యవహారంలో అసలు సూత్రధారులను వదిలేశారని, కింది స్థాయి ఉద్యోగుల పేర్లను మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చారని ఆయన ఆరోపించారు. తన' గో ధర్మ యాత్ర' సందర్భంగా సంభాల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఆలయ వ్యవహారాలు, కైంకర్యాలను మతపరమైన సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించడంలేదని ఆరోపణలు చేశారు.‘‘విరాళాల దొంగతనం గురించి ఒకరని ఏమి చెప్పగలం? రామ మందిరం విషయంలో మొదటి నుంచి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు.. వేదాలు లేదా మత పెద్దల సలహాలు పాటించలేదు.. రాజకీయ నాయకులు ఎంపిక చేసిన వ్యక్తులతో ట్రస్ట్ ఏర్పాటయ్యింది.. సాధువులు, జ్ఞానులు, పండితులను దూరంగా పెట్టారు’’అని ఆయన వ్యాఖ్యలను ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది. న్యాయమే ధ్యేయంగా ఉన్నట్లయితే, రాజకీయ నాయకులకు బదులుగా ట్రస్ట్ను నలుగురు శంకరాచార్యులు, రామానందాచార్యులు, ఇతర మత పెద్దలకు అప్పగించవచ్చు కదా? అని జోషి మఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు.‘‘ఎఫ్ఐఆర్లో పెద్ద తలకాయలను వదిలేశారు.. కేవలం నగదు లెక్కింపు బాధ్యతలు చేసే సిబ్బంది పేర్లు మాత్రమే ఉన్నాయి.. నోట్లను లెక్కించి, కట్టలు కట్టినవారు మహా అయితే కొన్ని నోట్లను మాత్రమే తీసుకోలగరు.. భారీ మొత్తంలో మాత్రం ప్రభావవంతమైన వ్యక్తులు మాత్రమే చేయగలరు.. వారిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదుకాలేదు’’ అని శంకరాచార్య అన్నారు.ఈ అంశాన్ని లేవనెత్తే హక్కు ప్రతిపక్షానికి ఉందని, బీజేపీని లక్ష్యంగా చేసుకున్నామని అవిముక్తేశ్వరానంద్ అన్నారు. ప్రతిపక్షం ఈ అంశాన్ని కారణం లేకుండా లేవనెత్తలేదని ఆ స్వామి అన్నారు. ‘‘ఆరోపణలలో నిజం ఉంటే, గుర్తుతెలియని వ్యక్తులపై అయినా సరే, మొదటి రోజే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది. విచారణ అనంతరం చివరికి ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే, దర్యాప్తు చేయాల్సిన విషయం ఏదో ఉందని చూపిస్తోంది.. అవకతవకలను ఎత్తిచూపుతూ ప్రతిపక్షం కేవలం తమ విధిని మాత్రమే నిర్వర్తిస్తోంది’’ అని ఆయన అన్నారు.బీజేపీని లక్ష్యంగా చేసుకున్న స్వామి అవిముక్తేశ్వరానంద.. ఆ పార్టీ హిందుత్వ 'నకిలీ' అని, దాని సభ్యులు 'నకిలీ హిందువులు' అని ఆరోపించారు. ‘‘ఎన్నికల సంఘంలో నమోదైనందున ఆ పార్టీ నిజమైనదే కావచ్చు.. కానీ దాని హిందుత్వ నిజమైనది కాదు. వేదాలను పాటించని వారు నకిలీ హిందువులు.. నిజమైన హిందువులు వేదాలను, శాస్త్రాలను, తమ గురువులను నమ్ముతారు, కానీ వీళ్లు నమ్మరు’’ అని ఆయన అన్నారు. విరాళాల దుర్వినియోగం కుంభకోణంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, నైతిక బాధ్యత వహిస్తూ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు ఈరోజు రాజీనామా చేయగా, ఎఫ్ఐఆర్లో పేర్కొన్న 8 మంది నిందితులను అరెస్టు చేశారు.