
ఆహార వ్యాపార రంగంలో నిబంధనల భారాన్ని తగ్గించి, వ్యాపార సౌలభ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలు-2011కు సవరణలు చేస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మార్పుల ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయని వ్యాపార సంస్థలకు కొన్ని ప్రధాన నిబంధనల నుంచి మినహాయింపు లభించింది.తాజా సవరణల ప్రకారం స్టాక్ రొటేషన్, రికార్డుల నిర్వహణ వంటి నిబంధనలు ఇకపై కేవలం ఆహార పదార్థాలను తయారు చేసే సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి. గతంలో లైసెన్స్ పొందిన అన్ని ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా రికార్డులను నిర్వహించడంతో పాటు 'ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్' (ఎఫ్ఐఎఫ్ఓ) లేదా 'ఫస్ట్ ఎక్స్పైరీ, ఫస్ట్ అవుట్' (ఎఫ్ఈఎఫ్ఓ) పద్ధతులను పాటించాల్సి ఉండేది. అయితే, ఇప్పుడు రిటైలర్లు, ఇతర అనుబంధ వ్యాపార సంస్థలకు ఈ నిబంధనల నుంచి ఉపశమనం కల్పించారు. ఆహార భద్రత, నాణ్యత, ఉత్పత్తుల ట్రేసబిలిటీ వంటి అంశాల దృష్ట్యా తయారీ రంగంలో ఈ నిబంధనలు అత్యవసరం కాబట్టి, వాటికి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మార్పుల వల్ల ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై నిబంధనల భారం గణనీయంగా తగ్గుతుందని, వారి కార్యకలాపాలు సులభతరం అవుతాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ప్రమాద ఆధారిత (రిస్క్-బేస్డ్) నియంత్రణను ప్రోత్సహించడమే లక్ష్యంగా చేపట్టిన విస్తృత సంస్కరణల్లో ఈ సవరణలు ఒక భాగమని స్పష్టం చేసింది.