
ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెంది
న షాపుసాని మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు షాపుసాని శ్రీనాథ్ రెడ్డి(25) ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లాడు. అక్కడ లీసెస్టర్ పట్టణంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఎంఎస్ మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసి ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో శ్రీనాథ్ రెడ్డి హఠాన్మరణం అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లొచ్చి.. శ్రీనాథ్ రెడ్డి స్నేహితుడు అందించిన వివరాల ప్రకారం.. ఈనెల 22వ తేదీ రాత్రి శ్రీనాథ్ రెడ్డి తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. బర్త్‌డే పార్టీ ముగిసిన తర్వాత రాత్రి ఆలస్యంగా లండన్‌లోని తన గదికి చేరుకుని నిద్రపోయాడు. అయితే, మరుసటి రోజు ఎంతకీ శ్రీనాథ్ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అతడి స్నేహితుడు గదిలోకి వెళ్లి చూశాడు. అప్పటికే శ్రీనాథ్ రెడ్డి స్పృహ లేకుండా పడి ఉండటం, మరణించి ఉండటాన్ని గమనించిన స్నేహితుడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే ఈ సమాచారాన్ని లండన్‌లో ఉన్న ఇతర మిత్రులకు చేరవేశాడు.కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులులండన్‌లో ఉన్న శ్రీనాథ్ రెడ్డి స్నేహితులు ఈ విషాద వార్తను స్వగ్రామమైన తలమడ్లలోని అతడి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. చేతికి అందిన కొడుకు లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడనే వార్త వినగానే తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి, మంజుల గుండెలవిసేలా రోదించారు. ప్రస్తుతం తలమడ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు, అలాగే లండన్ వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు తల్లిదండ్రులు, బంధువులు పాస్‌పోర్ట్, వీసా తదితర ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు సమాచారం. ఈ ఘటనపై లండన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.