
ఊట్కూర్, జూన్ 26 : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి.
నవమి, దశమి ఉత్సవాల సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మతసామ రస్యానికి ప్రత్యేకగా నిర్వహించే మొహరం వేడుకల సందర్భంగా శుక్రవారం హసన్, హుస్సేన్ పీర్ల సవారిని పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుబడుల్లో భాగంగా పలువురు మేకలు, గొర్రెలతో కందూర్లు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు.
మొహరం ఉత్సవాల నేపథ్యంలో మండల కేంద్రం భక్తులతో కిటకిటలాడింది. రుద్ర నగర్ లో నిర్వహించిన డోలారోహణం వేడుకలను తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు బొడ్డెమ్మలు, యువకులు అలై బలై నృత్యంతో చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. నారాయణపేట డిఎస్పి లింగయ్య, మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్సై రమేష్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రేణుక భరత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు భక్తులకు వసతులను కల్పించారు.