
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా మాస్కో ఆధీనంలో ఉన్న క్రిమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై కీవ్ వందల కొద్దీ డ్రోన్లతో విరుచుకుపడింది.
ఒక్క రాత్రే 660 డ్రోన్లను ప్రయోగించింది. వీటన్నింటిని తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. (Ukraine-Russia War)
రాజధాని మాస్కో సహా అజోవ్, నల్ల సముద్ర తీరంలోని నగరాలు, క్రిమియాను ఉక్రెయిన్ (Ukraine) లక్ష్యంగా చేసుకుంది. తమ నగరంవైపు దూసుకొచ్చిన 47 డ్రోన్లను కూల్చేసినట్లు మాస్కో మేయర్ వెల్లడించారు. అయితే, దీని వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా? అనే వివరాలను ఆయన బయటపెట్టలేదు. నోవోమోస్కోవ్స్కీ ప్రాంతంలోని ఓ కెమికల్ ప్లాంట్, హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్పై ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించగా.. అక్కడ భారీగా మంటలు చెలరేగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై రష్యా (Russia) నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఏడాది కాలంగా అమెరికా చేపట్టిన శాంతి ప్రయత్నాలు ఎలాంటి పురోగతి సాధించలేదు. ఈ నేపథ్యంలోనే రష్యా సైనిక స్థావరాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ ఇటీవల కాలంలో తమ దాడులను ఉద్ధృతం చేసింది. దీనిపై తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘యుద్ధం ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా 40 రోజుల పాటు కీలక ఆపరేషన్ చేపట్టనున్నాం’’ అని వెల్లడించారు. ఈ సమయంలో తమ చర్యలు అత్యంత ఉద్ధృతంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలుడిన కొద్ది గంటలకే రష్యాపై కీవ్ డ్రోన్లతో విరుచుకుపడటం గమనార్హం.
మరోవైపు, రష్యా కూడా క్షిపణులతో దాడులు ముమ్మరం చేసింది. గత 24 గంటల్లో ఖర్కీవ్లో మాస్కో జరిపిన దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. గత రాత్రి 189 రష్యన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. కీవ్పై సైనిక చర్యకు గానూ రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య వెల్లడించింది. 2027 జులై 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటన విడుదల చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.