
ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఏడుగురు మృతిచెందిన ఘటన జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రాజరప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ-బార్లాంగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
రాంచీ: ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఏడుగురు మృతిచెందిన ఘటన జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. రాజరప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని లారీ-బార్లాంగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఆటో ఓ లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఎదురుగా వస్తున్న బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ బాధితుల వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు పోలీసులకు సమాచారం అందించారు.
కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను రామ్గఢ్ సదర్ ఆస్పత్రికి తరలించారు. అయితే వారు ఆస్పత్రికి చేరుకునే లోపే ఏడుగురు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో వ్యక్తికి తలకు తీవ్ర గాయం కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. దీంతో క్షతగాత్రుడిని రాంచీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా పెళ్లి కార్యక్రమాల్లో బ్యాండ్ వాయించే వారని, హజారీబాగ్ జిల్లా బల్సాగ్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు రామ్గఢ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అలోక్ రంజన్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఐబీ చీఫ్గా ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి.. కేంద్రం ఆదేశాలు