
మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 లో టీమిండియా దుమ్మురేపింది. మ్యాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగిన గ్రూప్ స్టేజ్ నాల్గో మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బంగ్లాదేశ్ నిర్దేశించిన 137 పరుగుల టార్గెట్ను టీమిండియా చివరికి చాలా ఈజీగా ఛేజ్ చేసింది.
ఈ విక్టరీతో భారత్ సెమీఫైనల్ రేసులో స్ట్రాంగ్గా నిలిచింది. ఇప్పుడు టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే తదుపరి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై గెలవాల్సి ఉంటుంది, లేదా సౌతాఫ్రికా తన మ్యాచ్ల్లో ఒకదానిలో ఓడిపోవాలని కోరుకోవాలి. కాగా, ఈ మ్యాచ్ లో తెలుగమ్మాయి శ్రీ చరణి అద్భుతమైన బౌలింగ్ తో బ్యాటర్లకు దడపుట్టించింది.
ఈ మ్యాచ్లో టీమిండియా యంగ్ స్పిన్నర్ శ్రీ చరణి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఆమె మహిళల టీ20 వరల్డ్ కప్ ఒకే ఎడిషన్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓల్డ్ ట్రాఫోర్డ్లో బంగ్లాదేశ్తో జరిగిన గ్రూప్-స్టేజ్ మ్యాచ్లోనే శ్రీ చరణి ఈ అరుదైన మైలురాయిని అందుకుంది.
బంగ్లాదేశ్తో జరిగిన ఈ మ్యాచ్లో 21 ఏళ్ల శ్రీ చరణి రెండు కీలక వికెట్లు పడగొట్టింది. దీంతో ప్రస్తుత టోర్నమెంట్లో ఆమె తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 12కు చేరింది. ఈ ప్రదర్శనతో ఆమె గతంలో పూనమ్ యాదవ్ నెలకొల్పిన రికార్డును దాటేసింది. పూనమ్ యాదవ్ 2019-20 వరల్డ్ కప్ ఎడిషన్లో భారత్ తరఫున 10 వికెట్లు పడగొట్టి టాప్లో ఉండగా.. ఇప్పుడు శ్రీ చరణి ఆ రికార్డును బద్దలు కొట్టింది.
ఈ టీ20 వరల్డ్ కప్ అంతటా శ్రీ చరణి అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియాకు మెయిన్ పిల్లర్గా మారింది. ఆమె ఈ టోర్నీలో 7.08 యావరేజ్, అలాగే 5.31 ఎకానమీ రేట్ను మెయింటైన్ చేసింది. ఈ టోర్నమెంట్లో ఆమె బెస్ట్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ 4/19 గా నమోదైంది. శ్రీ చరణి భారత తరఫున కొత్త రికార్డును క్రియేట్ చేసినప్పటికీ, టోర్నమెంట్ ఓవరాల్ రికార్డు ఇంకా కాస్త దూరంలోనే ఉంది.
శ్రీ చరణి అద్భుత ఫామ్ చూస్తుంటే న్యూజిలాండ్ ఆల్రౌండర్ ఎమిలియా కెర్ వరల్డ్ రికార్డుకు ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఎమిలియా కెర్ 2024/25 ఎడిషన్లో కేవలం 6 మ్యాచ్ల్లోనే 15 వికెట్లు పడగొట్టి వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. టోర్నీలో భారత్ ముందడుగు వేస్తే శ్రీ చరణి ఈ వరల్డ్ రికార్డును కూడా దాటేసే అవకాశం ఉంది.