
వెనిజులాలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. గత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంత భారీ భూకంపం అక్కడ సంభవించింది. ఒకదాని తర్వాత ఒకటిగా రెండు సార్లు భూమి తీవ్రంగా కంపించింది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి.
ఈ ప్రకృతి విపత్తు వల్ల ఎన్నో భవనాలు కుప్పకూలాయి, భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.
అయితే, ఈ పెను ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందే చాలా మంది స్మార్ట్ఫోన్ యూజర్లకు గూగుల్ నుంచి ఒక అలర్ట్ మెసేజ్ వచ్చింది. భూకంపం రాబోతోంది జాగ్రత్త అంటూ గూగుల్ పంపిన నోటిఫికేషన్ చూసి జనం అప్రమత్తమయ్యారు. అసలు భూకంపం రాకను గూగుల్ ముందే ఎలా పసిగట్టింది? స్మార్ట్ఫోన్ ఎలా ఒక డిటెక్టర్లా మారింది? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వెనిజులాలో తాజాగా సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1, 7.5గా నమోదైంది. గత శతాబ్ద కాలంలో వెనిజులాలో చోటుచేసుకున్న అత్యంత వినాశకరమైన, పవర్ఫుల్ భూకంపాలు ఇవేనని రిపోర్ట్స్ చెబుతున్నాయి. భూమి కంపించడానికి కొన్ని సెకన్ల ముందే తమకు గూగుల్ అలర్ట్ పంపిందని ఎక్స్ లో కొందరు యూజర్లు స్క్రీన్షాట్లను షేర్ చేశారు.
ఒక యూజర్ షేర్ చేసిన స్క్రీన్షాట్లో.. దాదాపు 341 కిలోమీటర్ల (212.3 మైళ్లు) దూరంలో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది, జాగ్రత్త అంటూ గూగుల్ నోటిఫికేషన్ పంపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గూగుల్కు ఈ విషయం ముందే ఎలా తెలిసింది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
మనం వాడుతున్న ప్రతి మోడ్రన్ స్మార్ట్ఫోన్లో యాక్సిలెరోమీటర్ అనే ఒక చిన్న సెన్సార్ ఉంటుంది. నార్మల్గా మనం ఫోన్ అడ్డంగా తిప్పినప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్గా రొటేట్ అవ్వడానికి ఈ సెన్సార్ హెల్ప్ అవుతుంది. కానీ, దీనికి మరో పవర్ఫుల్ ఉపయోగం కూడా ఉంది. ఇది భూమిలో వచ్చే వైబ్రేషన్స్ చాలా ఈజీగా గుర్తిస్తుంది, వాటిని కొలుస్తుంది.
భూకంపం వచ్చేటప్పుడు భూమిలో ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో ఈ యాక్సిలెరోమీటర్ సెన్సార్ వెంటనే పసిగడుతుంది. అలా గుర్తుపట్టిన వెంటనే, ఆ స్మార్ట్ఫోన్ గూగుల్కు చెందిన ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్స్ సిస్టమ్ సర్వర్కు ఒక సిగ్నల్ పంపుతుంది. ఆ సిగ్నల్తో పాటు ఆ లొకేషన్ వివరాలను కూడా షేర్ చేస్తుంది.
ఇలా ఒక ఏరియాలోని ఒక ఫోన్ నుండి సిగ్నల్ వెళ్లగానే గూగుల్ అలర్ట్ అవుతుంది. ఆ వెంటనే అదే ఏరియాలోని మిగతా ఆండ్రాయిడ్ ఫోన్ల నుండి వస్తున్న డేటాను కూడా గూగుల్ సర్వర్లు క్రాస్ చెక్ చేసుకుంటాయి. ఒకే ప్రాంతంలోని చాలా ఫోన్ల నుండి ఒకే రకమైన వైబ్రేషన్ సిగ్నల్స్ వస్తే.. అక్కడ కచ్చితంగా భూకంపం వస్తోందని గూగుల్ సర్వర్ కన్ఫర్మ్ చేసుకుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ నెట్వర్క్లో 2 వందల కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ నెట్వర్క్లో పార్ట్ కాబట్టి, ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్మోగ్రాఫ్ అంటే భూకంపాలను గుర్తించే వ్యవస్థగా మారిపోయింది.
భూకంపం మనకు తెలియక ముందే గూగుల్ ఎలా చెప్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. భూకంపం అనేది ఒకేసారి పెద్ద షాక్లా రాదు, అది తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. భూకంపంలో మొదట వచ్చే ప్రైమరీ వేవ్స్ చాలా వేగంగా సెకనుకు 6 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకొస్తాయి. కానీ ఇవి చాలా బలహీనంగా ఉంటాయి కాబట్టి మనకు వెంటనే తెలియవు.
వీటి వెనుక వచ్చే సెకండరీ వేవ్స్ సెకనుకు 3 నుండి 4 కిలోమీటర్ల వేగంతో వస్తాయి. వీటి వల్లే బిల్డింగ్లు కూలిపోవడం, నష్టం జరగడం లాంటివి జరుగుతాయి. ఫోన్లోని సెన్సార్ ఆ వేగవంతమైన ప్రైమరీ వేవ్స్ను ముందే పసిగట్టి లైట్ స్పీడ్తో గూగుల్ సర్వర్కు సమాచారం అందిస్తుంది. కాబట్టి విధ్వంసం సృష్టించే S-వేవ్స్ మనల్ని చేరేలోపే గూగుల్ మన ఫోన్కు అలర్ట్ పంపేస్తుంది.
గూగుల్ అందిస్తున్న ఈ సూపర్ సేఫ్టీ ఫీచర్ ఇండియాలో కూడా అందుబాటులో ఉంది. 2023 నుండి ఆండ్రాయిడ్ 5 అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ సిస్టమ్ పనిచేస్తోంది. ఆండ్రాయిడ్లో భూకంప తీవ్రతను బట్టి రెండు రకాల అలర్ట్స్ వస్తాయి. ఒకటి బీ అవేర్ అలర్ట్, ఇది చిన్నపాటి కంపనాలు వచ్చినప్పుడు యూజర్లను అలర్ట్ చేస్తుంది.
రెండోది టేక్ యాక్షన్ అలర్ట్, ఇది మీడియం నుండి హెవీ భూకంపాలు వచ్చేటప్పుడు యూజర్లు ప్రాణాలు కాపాడుకోవడానికి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి వార్నింగ్ ఇస్తుంది. ఈ అలర్ట్ పై క్లిక్ చేస్తే ఎలా సేఫ్గా ఉండాలో కూడా గూగుల్ చూపిస్తుంది. అయితే, ఈ అలర్ట్స్ రావాలంటే మీ ఫోన్లో వైఫై లేదా సెల్యులార్ డేటా ఆన్లో ఉండాలి. ఒకవేళ మీకు ఈ అలర్ట్స్ వద్దు అనుకుంటే ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లి దీన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు.