
ఈ లోకంలో ధనం మూలం ఇదం జగత్ అని అంటుంటారు. అందుకే ఆ డబ్బు కోసం ఎంతటి దారుణాలు చేయడానికైనా జనాలు వెనుకాడటం లేదు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కేవలం రూ.
ఈ లోకంలో ధనం మూలం ఇదం జగత్ అని అంటుంటారు. అందుకే ఆ డబ్బు కోసం ఎంతటి దారుణాలు చేయడానికైనా జనాలు వెనుకాడటం లేదు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కేవలం రూ.250 అప్పు తిరిగి అడిగినందుకు ఓ యువకుడిపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి యత్నించిన ఘోర ఉదంతం థాటీపూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు దాదాపు 60 శాతం వరకు కాలిపోయి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బాధితుడిని రక్షించే ప్రయత్నంలో ఓ ఏటీఎం సెక్యూరిటీ గార్డు కూడా గాయపడ్డాడు. ఈ అమానుష ఘటనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హజీరా ప్రాంతానికి చెందిన రామచంద్ర సెంగర్ అనే వ్యక్తి మయూర్ మార్కెట్లోని ఓ టూర్ అండ్ ట్రావెల్స్ కార్యాలయంలో చౌకీదార్‌గా పనిచేస్తున్నాడు. అతని కొడుకు ఆకాష్ కూడా తండ్రికి సహాయం చేస్తూ ఆటో స్టాండ్ నిర్వహణను చూసుకునేవాడు. రాత్రి వేళల్లో పెట్రోల్ బంకులు మూతపడిన తర్వాత అర్ధరాత్రి పెట్రోల్ అడిగే వారి కోసం రామచంద్ర అదనంగా కొంత పెట్రోల్‌ను దగ్గర ఉంచుకునేవాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అనుజ్ అలియాస్ వలీ గుర్జర్, సచిన్ గుర్జర్, అరవింద్ ఛావయ్ అనే ముగ్గురు నిందితులు బైక్‌పై అక్కడికి వచ్చారు. వారు 100 రూపాయల పెట్రోల్ తీసుకుని, రామచంద్రకు 500 రూపాయల నోటు ఇచ్చారు. ఆ సమయంలో రామచంద్ర వారి వద్ద గతంలో ఉన్న 250 రూపాయల పాత అప్పును మినహాయించుకుని మిగిలిన డబ్బులు ఇవ్వబోయాడు. దీంతో వారి మధ్య తీవ్ర వివాదం మొదలైంది.ఈ వాగ్వాదం కాస్తా ముదరడంతో నిందితులు రామచంద్రపై దాడికి దిగారు. తండ్రిని కాపాడుకోవడానికి కుమారుడు ఆకాష్.. సమీపంలో ఉన్న ఏటీఎం గార్డుతో కలిసి అడ్డొచ్చాడు. అయితే నిందితులు కర్రలతో వారిద్దరిపై కూడా విరుచుపడ్డారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆకాష్ ట్రావెల్స్ ఆఫీస్ లోపలికి పరుగెత్తగా.. నిందితులు అతడిని వెంబడించారు. అక్కడ బాటిల్‌లో ఉంచిన పెట్రోల్‌ను ఓ నిందితుడు ఆకాష్‌పై కుమ్మరించగా.. మరొకరు లైటర్‌తో నిప్పటించారు. ఒళ్లంతా మంటలు అంటుకుని ఆకాష్ కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.ఈ దారుణం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఏఎస్పీ కార్యాలయం ఉంది. అయినా కూడా చౌరస్తాలో జనం చూస్తుండగానే నిందితులు బరితెగించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. నిందితులు వలీ గుర్జర్ (22), సచిన్ గుర్జర్ (24)లను బుధవారం అరెస్ట్ చేసినట్లు థాటీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్-చార్జ్ విపేంద్ర సింగ్ చౌహాన్ వెల్లడించారు. పరారీలో ఉన్న మూడో నిందితుడు అరవింద్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, నిందితుల పాత నేర చరిత్రను కూడా తవ్వుతున్నామని ఆయన తెలిపారు.