21 ఏళ్లు వచ్చే దాకా చదువు.. ఆ వెంటనే ఉద్యోగాల కోసం పట్టణాల వైపు పరుగులు.. చదువుకు తగ్గ ఉద్యోగం, దానికి తగ్గా జీతం వస్తే పర్లేదు.
చదువుకున్న చదువుకు ఏ మాత్రం సంబంధం లేని ఉద్యోగం వచ్చి, చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడేవారు కొందరైతే.. ఉద్యోగాలు రాక, ఉపాధి లేక ఇబ్బందులు పడేవారు మరెందరో. ఏసీ గదులలో కంప్యూటర్ల ముందు కూర్చుని, అరకొర జీతాలతో ఇబ్బందులు పడుతూ జీవితాన్ని గడిపే సగటు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు అనంతపురం జిల్లాకు చెందిన యువ రైతు లింగారెడ్డి. కళ్యాణదుర్గం మండలంలోని దాసంపల్లి గ్రామానికి చెందిన లింగారెడ్డి అనే యువకుడు.. ఉన్నత చదువులు చదువుకుని, ఉద్యోగం చేస్తూ జీతం, జీవితంపై సంతృప్తి లేక సొంతూరికి తిరిగి వచ్చి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సేద్యంలో లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నాడు.2016లో లింగారెడ్డి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత చెన్నైలోని ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత బెంగళూరులోని ఓ కంపెనీలో మార్కెటింగ్ సేల్స్ అధికారిగా చేరారు. అక్కడ ఇచ్చే నెలకు రూ.30 వేలు జీతం అతనికి సరిపోయేది కాదు. దీంతో ఆరు నెలల పాటు వివిధ కంపెనీలు మారారు. జీతాలు చాలక, వాతావరణం సరిపడక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరకు సొంతూరు దాసంపల్లికి మూడేళ్ల కిందటే తిరిగి చేరుకున్నారు. యూట్యూబ్ గురువు.. సాగులో అద్భుతాలుసొంతూరికి తిరిగి వచ్చిన లింగారెడ్డి ఏం చేయాలా అని ఆలోచించి.. చివరకు సేద్యం వైపు అడుగులు వేశారు. తన 14 ఎకరాల భూమిని సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సంప్రదాయ పద్ధతులలో కాకుండా ఆధునిక విధానంలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. యూట్యూబ్లో పంటల సాగు, వ్యవసాయం గురించి వీడియోల ద్వారా తెలుసుకున్నారు. ఆ పరిజ్ఞానంతోనే తనకు ఉన్న 14 ఎకరాల వ్యవసాయ భూమిలో వివిధ రకాల పంటలు సాగు చేయటం ప్రారంభించారు. టమాటా, బీర, వంగడ వంటి కాయగూరలతో పాటుగా బొప్పాయి, పుచ్ఛకాయ వంటి పంటలు సాగు చేశారు.తండ్రి మరణం.. కుటుంబ బాధ్యతలుఅయితే ఇదే సమయంలో లింగారెడ్డి జీవితంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆయన తండ్రి చనిపోయారు. దీంతో సేద్యం బాధ్యతలతో పాటుగా కుటుంబ బాధ్యతలను కూడా తానే మోయాల్సి వచ్చింది. 2025లో టమాటా సాగు చేసిన లింగారెడ్డికి రూ.50 లక్షలు వచ్చాయి. బీర పంటలో 12 లక్షల రూపాయలు, కళింగరలో 2 లక్షల రూపాయల వరకూ వచ్చాయి. అయితే పెట్టుబడులు పెట్టిన మొత్తం పోనూ 45 లక్షల వరకూ లాభం వచ్చింది. అయితే ఉద్యోగంలో సంతృప్తి లేక.. కుటుంబ సభ్యులకు అంగీకరించటంతోనే వ్యవసాయంలోకి అడుగుపెట్టినట్లు లింగారెడ్డి చెప్తున్నారు. సీజన్కు అనుగుణంగా పంటలు పండించటం వల్లనే లాభాలు వచ్చాయని.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందంటున్నారు లింగారెడ్డి.