
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో చమురు రవాణాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వేగవంతం అవుతున్నాయి.
దీంతో అంతర్జాతీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా చమురు ధరలు (Oil Prices) భారీగా దిగొస్తున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర అమెరికా-ఇరాన్ యుద్ధం ముందు స్థితికి పడిపోవడం ఊరటనిస్తోంది. గురువారం ఉదయం బ్రెంట్ క్రూడ్ (Brent Crude) బ్యారెల్ ధర 72.28 డాలర్లకు పడిపోయింది. క్రితం సెషన్తో పోలిస్తే దీని ధర 4శాతం మేర తగ్గడం గమనార్హం.
ఇక, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడాయిల్ ధర 1.69శాతం తగ్గి బ్యారెల్కు 69.15 డాలర్లు పలికింది. ఇటీవలి కాలంలో దీని ధర 70 డాలర్ల దిగువకు చేరడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో హర్మూజ్ జలసంధి మీదుగా కనీసం 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అయినట్లు అమెరికా ఇంధన మంత్రిత్వశాఖ వెల్లడించింది. రాబోయే కొన్ని వారాల్లోనే ఈ జలమార్గంలో చమురు రవాణా యుద్ధం మునుపటి స్థాయికి పెరుగుతుందని అంచనా వేసింది. పశ్చిమాసియాలో యుద్ధం ముగియడంతో పాటు ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలను సడలించడం వంటి కారణాలతో క్రూడాయిల్ ధరలు దిగొస్తున్నాయి.
అటు బంగారం, వెండి ధరలు (Gold,Silver Prices) కూడా తగ్గుముఖం పట్టాయి. నేడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3996 డాలర్లకు చేరింది. వెండి (Silver) ధర 57.35 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో హైదరాబాద్ విపణిలో గురువారం ఉదయం 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల (Gold) ధర రూ.1.44లక్షలు పలికింది. కిలో వెండి ధర రూ.2.22లక్షలకు దిగొచ్చింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1.41లక్షలు (10 గ్రాములకు), వెండి ఫ్యూచర్ ధర రూ.2.13లక్షలుగా (కిలోకు) ట్రేడ్ అవుతోంది.
మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు కూడా గురువారం లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు.. దేశీయంగా బ్యాంకింగ్, స్థిరాస్తి రంగ సూచీల్లో కొనుగోళ్లు సూచీలకు మద్దతుగా నిలిచాయి. దీంతో ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 511.62 పాయింట్లు పెరిగి 77,502 వద్ద, నిఫ్టీ (Nifty) 150 పాయింట్ల లాభంతో 24,172 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 22 పైసలు పెరిగి 94.33 వద్ద కొనసాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.