
Venezuela Earthquakes| ఇంటర్నెట్డెస్క్: వెనెజువెలా దేశాన్ని వరుసగా రెండు భూకంపాలు వణికించాయి. ఈ ప్రకృతి విపత్తు తీవ్రత ధాటికి దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది.
పలు బహుళ అంతస్తు భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయి ఉండొచ్చని, దాంతో భారీ సంఖ్యలో ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘‘ఈ భూకంపాల తర్వాత బలమైన ప్రకంపనలు రావొచ్చు. దాంతో ఈ విపత్తు విధ్వంసకరంగా ఉండొచ్చు. భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించే అవకాశం ఉంది. మృతుల సంఖ్య 10వేల నుంచి లక్ష వరకు ఉండవచ్చు’’ అని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
ప్రస్తుతానికి వెనెజువెలా ప్రభుత్వం మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. భూకంపాల ధాటికి గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉందని స్థానిక అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
ఇళ్లను వదిలి బయటకు వచ్చేయాలంటూ భూకంపాల ప్రభావిత ప్రాంతాల ప్రజలకు వెనెజువెలా ప్రభుత్వం సూచించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇళ్లకున్న పెట్రోల్ సరఫరాను కట్ చేసినట్లు వెల్లడించింది. కొన్ని భవనాలు కూలిపోయాయని, మరింత నష్టం వాటిల్లకుండా ఈ చర్యలని పేర్కొంది.
జూన్ 24.. వెనెజువెలాలో నేషనల్ హాలిడే. దాంతో మిగతా రోజులతో పోలిస్తే.. ఎక్కువమంది ఇళ్లలోనే ఉన్నారు. నిన్నసాయంత్రం ఆరుగంటల సమయంలో తొలి భూకంపం వచ్చింది. దాంతో భూమి కంపించినప్పుడు భారీగా ప్రజలు బయటకు పరిగెత్తిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాణనష్ట తీవ్రత పెరగడానికి ఈ హాలిడే కూడా ఒక బలమైన కారణం కావొచ్చని అధికారులు చెప్తున్నారు. ఈ విపత్తులో భారీగా మరణాల సంఖ్య ఉండొచ్చని వెనెజువెలా అధ్యక్షురాలు రోడ్రిగ్స్ కూడా తన సందేశంలో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.