తుంగభద్ర జలాల్లో తెలంగాణకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ఆయకత్తు ప్రయోజనాలను కాపాడాలన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన నీళ్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను బీడు భూములకు మళ్లించి పాలమూరు వంటి వలసల జిల్లాలను పచ్చని పంటలతో కళకళలాడేలా చేసిందని గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్కు పూర్తి సహకారం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. తాను పాలమూరు బిడ్డనని చెప్పుకునే సీఎం.. అదే పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన నిలదీశారు. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుమతులు లేకుండానే కర్ణాటక తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీశారు. ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి ప్రభుత్వం అనుమతించినట్లేనని.. అసలు తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఎగువన కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతల పథకం, ఇతర బ్యారేజీలు పూర్తయితే ఆర్డీఎస్కు రావాల్సిన ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయన్న విషయం తెలిసి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ అక్రమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కనీసం ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదని నిలదీశారు.రాజోలిబండ ఆనకట్టకు కేవలం 100 మీటర్ల ఎగువన అక్రమంగా నిర్మిస్తున్న కురిడి లిఫ్ట్, ఇతర బ్యారేజీలు పూర్తయితే తెలంగాణకు వచ్చే వాటా మరింత తగ్గిపోయి ఆర్డీఎస్ ఆయకట్టు పూర్తిగా నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం చూపేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ ప్రారంభించిన ఆర్డీఎస్ ఫేస్ 2 పనులను పడావు పెట్టారని విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్ నిబంధనలను ఖాతరు చేయకుండా కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తుంటే రాష్ట్రం ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటన్నారు. తమ జల హక్కులను కాపాడటం కోసం బీఆర్ఎస్ నిర్విరామ పోరాటం చేస్తుందని ఎంత దూరం దాకా అయినా వెళ్లి కొట్లాడుతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.