
బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. కొంతకాలంగా రికార్డు స్థాయిలో పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
దేశీయ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు పసిడి ధరలు తగ్గడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా పెట్టుబడుల కోసం బంగారం కొనాలని భావిస్తున్న వారికి కొంత ఊరట లభిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల బలహీనత, అమెరికా వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాలు, డాలర్ సూచీలో మార్పులు వంటి అంశాలు దేశీయ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా పెరుగుదల దిశగా సాగిన బంగారం ధరలు ఇప్పుడు స్వల్పంగా క్షీణిస్తున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.270 తగ్గి రూ.1,44,330గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 మేర తగ్గి రూ.1,32,300గా ఉంది.
అయితే ఈరోజు మార్కెట్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం వెండి ధరల పతనమే. కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి ప్రస్తుతం రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమల అవసరాలు, అంతర్జాతీయ డిమాండ్, పెట్టుబడిదారుల కొనుగోళ్లు వెండి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంటాయి. అందుకే వెండి ధరల్లో ఇలాంటి భారీ మార్పులు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ధరలు కొంత తగ్గుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ దశలవారీగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు లేదా ఇతర అవసరాల కోసం బంగారం కొనాలనుకునేవారికి ప్రస్తుతం కనిపిస్తున్న ఈ తగ్గుదల కొంత ఉపశమనాన్ని అందిస్తోందనే చెప్పాలి. ప్రస్తుతం పసిడి ప్రియులకు ఈ తగ్గుదల ఒక చిన్న ఊరటగా మారింది.