అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు అయిపోయాయి. ఇరు దేశాల మధ్య ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధి, అణ్వాయుధాల తయారీ అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు మళ్లీ...
అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు అయిపోయాయి. ఇరు దేశాల మధ్య ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధి, అణ్వాయుధాల తయారీ అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఎలాంటి టోల్ ఫీజులు విధించకూడదంటూ అమెరికా విదేశాంగ్ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. "హార్మూజ్ ఒక అంతర్జాతీయ జలమార్గం. అంతర్జాతీయ జలమార్గంపై ఏ దేశం కూడా టోల్ ఫీజులు వసూలు చేయడానికి హక్కు లేదు. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ కూడా ఇదే అభిప్రాయంతో ఉంటాయని నేను భావిస్తున్నాను" అని రూబియో అన్నారు. అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేసేలా ఓ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్లో పాకిస్థాన్, ఖతార్ మధ్యవర్తిత్వంలో తొలి దశ చర్చలు కూడా జరిగాయి. వచ్చే 60 రోజులు ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ అణు కార్యక్రమం, హార్మూజ్ జలసంధి భవిష్యత్ నిర్వహణపై తుది ఒప్పందం కుదుర్చుకోవాలని కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. ఇరాన్ తరఫున ఈ చర్చలకు హాజరైన కీలక నేత ఘాలీబాఫ్ స్విట్జర్లాండ్ను వీడుతున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాను తాము ఎప్పటికీ నమ్మబోము అంటూనే.. హార్మూజ్ జలసంధి యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితికి తిరిగి వెళ్లదంటూ ప్రకటించారు. అంటే హార్మూజ్పై ఇరాన్కే పూర్తి నియంత్రణ ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ వెంటనే ఇరాన్, ఒమన్ దేశాలు హార్మూజ్ జలసంధి సేవల కోసం వసూలు చేసే ఛార్జీల అంశాన్ని అధ్యయనం చేస్తామని తెలిపాయి. పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ మాట్లాడుతూ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరపబోమని తేల్చి చెప్పారు. తమ దగ్గర క్షిపణులు లేకపోయి ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ను గాజా మాదిరిగా ధ్వంసం చేసేవని, అందుకే వాటిపై ఎప్పటికీ చర్చించమని చెప్పారు. ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలకు అంగీకరించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెబుతుండగా ఇరాన్ ఆ వాదనను ఖండించింది.