
England vs New Zealand: న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లండ్ జట్టుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కోలుకోలేని భారీ షాక్ ఇచ్చింది.
ఒకవైపు మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉన్న ఆ జట్టుపై స్లో ఓవర్ రేట్ కింద పెద్ద ఎత్తున జరిమానా విధించడమే కాకుండా, ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లలోనూ భారీ కోత విధించింది. దీంతో ఇంగ్లండ్ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి.
ఓవల్ టెస్టులో పూర్తిగా తేలిపోయిన ఇంగ్లీష్ జట్టు..
బెన్ స్టోక్స్ గైర్హాజరీలో న్యూజిలాండ్తో ఓవల్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ జో రూట్ నేతృత్వంలోని జట్టు కివీస్ ఆటగాళ్లకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. అడుగడుగునా తడబడిన ఇంగ్లీష్ ఆటగాళ్లు.. మ్యాచ్ను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. సొంత గడ్డపై జరిగిన ఈ ఘోర పరాభవం ఆ జట్టు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆట పరంగానే కాకుండా, క్రమశిక్షణ పరంగా కూడా ఇంగ్లండ్ విఫలమవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇది కూడా చదవండి: ఒకరిద్దరు కాదు షేర్ఖాన్.. ఆరో నంబర్ దాకా యమగండాలే.. ఐర్లాండ్తో తలపడే భారత్ విధ్వంసక జట్టు ఇదే?
దారుణ ఓటమి నుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇంకా తేరుకోకముందే ఐసీసీ వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఆదివారం నాడు అంతర్జాతీయ క్రికెట్ మండలి మొత్తం జట్టుపై తీవ్ర చర్యలు తీసుకుంది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడం వారి పాలిట శాపంగా మారింది. లెక్కల ప్రకారం ఇంగ్లండ్ జట్టు ఏకంగా 12 ఓవర్లు వెనుకబడిపోయింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 నిబంధనల ప్రకారం.. తక్కువగా వేసిన ప్రతి ఓవర్కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ లెక్కన 12 ఓవర్లకు గానూ ఇంగ్లండ్ ఆటగాళ్లందరి మ్యాచ్ ఫీజులో ఏకంగా 60 శాతం కోత పడింది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాతాళానికి..
కేవలం జరిమానాతోనే ఈ శిక్ష ఆగిపోలేదు. దీని ప్రభావం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసుపైనా పడింది. డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం.. షార్ట్ ఓవర్కు ఒక పాయింట్ చొప్పున కట్ చేస్తారు. అంటే ఏకంగా 12 పాయింట్లను ఇంగ్లండ్ కోల్పోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆ జట్టు గెలుపు శాతం 34.72 నుంచి ఒకేసారి 26.38 శాతానికి అమాంతం పడిపోయింది. ఈ కఠిన నిర్ణయాన్ని ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రకటించగా.. ఇంగ్లండ్ తాత్కాలిక కెప్టెన్ జో రూట్ తన తప్పును అంగీకరిస్తూ ఎలాంటి అభ్యంతరం లేకుండా సమ్మతించాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ 6వ స్థానంలో, ఇంగ్లండ్ 7వ స్థానంలో నిలిచాయి.
ఇది కూడా చదవండి: IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?
ఇన్ని వరుస ఎదురుదెబ్బల మధ్య ఇంగ్లండ్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఒకటి ఉంది. కివీస్తో త్వరలో జరగనున్న మూడో టెస్టు కోసం ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి అడుగుపెట్టనున్నాడు. నైట్క్లబ్ వివాదం కారణంగా అతను ఓవల్ టెస్టుకు దూరమయ్యాడు. అయితే తాజాగా ఆ వివాదం నుంచి అతనికి క్లీన్ చిట్ లభించింది. దీంతో అతను మళ్లీ ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టడానికి సిద్ధమయ్యాడు. అతనితో పాటుగా పేస్ బౌలర్ గస్ అట్కిన్సన్ను కూడా ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ బోర్డు ఎంపిక చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..